America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న యువతీయువకులు అక్కడ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం నెలకు ఒకరు చొప్పున తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువ ఇంజనీర్ దిలీప్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ యువ ఇంజనీర్ మృతి చెందాడు. మృతుడు సొంతూరు చిట్వేల్ మండలం, జెట్టివారిపల్లి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు.. ఉన్నత చదువుల కోసం మూడేళ్ల కిందట అమెరికా వెళ్లాడు దిలీప్కుమార్. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు.
ఐదు నెలల కిందట ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆగష్టు 7న తన ఫ్రెండ్ని ఎయిర్పోర్టులో దించి తిరిగి వస్తున్నాడు. ఒహాయో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో దిలీప్ ప్రయాణిస్తున్న కారుని ఎదురుగా వస్తున్న ఓ పికప్ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ కారు నుజ్జు నుజ్జు అయ్యింది.
స్పాట్లో దిలీప్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో దిలీప్ మృతి వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. జట్టివారిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. దిలీప్ తల్లిదండ్రులు శ్రీహరి- చాముండి కన్నీరు మున్నీరుగా విలపించారు.
ALSO READ: అమ్మ గుర్తుకు రావడంతో.. భార్యను చంపి భర్త ఆత్మహత్య, తూర్పుగోదావరి జిల్లాలో దారుణం
అమెరికాలో వీకెండ్ సెలవులు కావడంతో దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై న్యూయార్క్లోని భారత కాన్సులేట్ రియాక్ట్ అయ్యింది. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని, భౌతికకాయాన్ని భారత్కు తరలించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.