East Godavari: సృష్టిలో తల్లి ప్రేమకు మించినది లేదు. పుట్టిన దగ్గర నుంచి పిల్లలను కంటి రెప్పలా కాపాడుకుంటుంది. కొందరైతే తల్లి లేని ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడరు. అలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కన్న తల్లి దూరమైందన్న బాధను తట్టుకోలేకపోయాడు ఓ కొడుకు. ఆమె లేని లోకంలో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. ఫలితంగా భార్యని చంపి, ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. అసలేం జరిగింది?
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో ఆదివారం ఈ ఉదంతం బయటపడింది. 35 ఏళ్ల లక్ష్మణరావు చిన్నతనంలో పోలియో బారిన పడ్డాడు. ఆయన రెండు కాళ్లు చొబ్బడిపోయినా, అధైర్య పడకుండా జనరల్ స్టోర్ షాపు పెట్టుకుని జీవనం సాగించేవాడు. ఏడాది కిందట లక్షణరావు-శ్యామల మధ్య వివాహమైంది. శ్యామల కూడా మానసిక దివ్యాంగురాలు కావడంతో ఇద్దరి వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నెలకు రూ. 12 వేల పింఛను ఇస్తోంది.
లక్ష్మణరావుకు తల్లి అంటే పంచప్రాణం. తల్లి కోసం ఏమైనా చేస్తాడు. కొద్ది నెలల కిందట అనారోగ్యంతో ఆయన తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. దీంతో లక్ష్మణరావు మానసికంగా కుంగిపోయాడు. తల్లి జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు రావడం మొదలైంది. తల్లి లేని ఈ లోకంలో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తున్న భార్య శ్యామల చేతి మణికట్టుని కత్తితో కోశాడు. నరాలు తెగిపోవడంతో రక్తస్రావం కావడంతో మంచంపై ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మణరావు మంచంపై కూర్చుని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఆదివారం ఉదయం లక్ష్మణరావు ఇంటి తలుపులు తెరచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వాళ్లకు అనుమానం వచ్చింది. తలుపులు తోయడంతో భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మణరావు సెల్ఫోన్ను పరిశీలించగా సెల్ఫీ వీడియో దొరికింది. అమ్మ పదే పదే గుర్తుకు రావడంతో అమ్మ దగ్గరకు వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. తాను చనిపోతే భార్యను ఎవరూ పట్టించుకోరని, అందుకే తన వెంట తీసుకెళ్తున్నానని అందులో ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.