Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూటమి ప్రభుత్వం తీరు, డీఎస్సీ గందరగోళం , బీసీ రిజర్వేషన్ల వివాదంపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. శాసనసభా సంప్రదాయాలను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.
కూటమి పారిపోయే వైఖరి
సభ ప్రారంభమైన మూడో రోజు కూడా కూటమి ప్రభుత్వం పారిపోయే వైఖరినే అవలంబించిందని బొత్స విమర్శించారు. బయట మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్న పాలక పక్షం.. సభలో మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పార్టీ బయటకు వెళ్లిపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త చెడు సంప్రదాయానికి తెరతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయాలు, రూల్ బుక్స్, చట్టాలను పక్కనబెట్టి ‘మేము చెప్పిందే మీరు చేయాలి’ అన్నట్లుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
డీఎస్సీపై సిబిఐ విచారణకు డిమాండ్
డీఎస్సీ వ్యవహారంలో జీవోలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కేవలం అమ్ముకోవడానికే ఇలా మార్పులు చేశారని బొత్స ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గ్రూప్-1 పరీక్షలపై చర్చించి విచారణ వేయమని అడుగుతుంటే కనీసం ఆ పేరు ఎత్తడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.
బీసీల సంక్షేమం, జగన్ పాలన
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. కానీ బీసీల రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది టీడీపీ నేతలేనని మండిపడ్డారు. 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చారో రేపు వివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. సభలో చర్చించిన అంశాలనే మండలిలోనూ చర్చించాలని అడుగుతున్నామని, ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు సభను పొడిగించాలని కోరారు.
Also Read: స్కూటీపై ఐదుగురు మైనర్ల డేంజరస్ రైడ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!