Avinash Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, స్థానిక టీడీపీ నేత బీటెక్ రవిపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ. 24 వేలు ఖర్చు పెట్టడం దండగని, ఆ నిధులు మెడికల్ కాలేజీలకు కేటాయిస్తే బాగుంటుందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ టాక్స్ (రూ. 33) తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. అయితే, ప్రజలకు సంబంధించిన ఈ అంశాలకు సమాధానం చెప్పలేక, గత వారం రోజులుగా కూటమి ప్రభుత్వం ‘గొడ్డలి పార్టీ’ అంటూ పాత క్రిమినల్ అంశాలను లాగి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.
బీటెక్ రవి వ్యాఖ్యలకు కౌంటర్
‘జగన్ అనుకుంటే నేను అరగంట కూడా బ్రతకలేను’ అని గతంలో బీటెక్ రవి స్వయంగా అన్నారని, జగన్ గారికి అలాంటి ఆలోచనలు లేకపోయినా ఇప్పుడు కొందరు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. గతంలో ఎంపీటిసి పదవి కోసం, ఎన్నికల తర్వాత వైసిపిలో చేరుతాననే ప్రతిపాదనతోనే బీటెక్ రవి తన ఉలిమెల్ల తోటకు రాయభారానికి వచ్చారని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే తన పదవిని అమ్ముకోవడానికి విజయసాయిరెడ్డిని కూడా కలిశారన్నారు.
బైరటీస్ అక్రమ విక్రయాల ఆరోపణలు
తమ కుటుంబానికి 1950ల నుంచే క్లాస్ వన్ కాంట్రాక్టర్ చరిత్ర ఉందన్న ఎంపీ, ప్రజల సొమ్మును తాము దోచుకోలేదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ‘టిఫిన్ బైరటీస్’కు చెందిన రూ. 9 కోట్ల విలువైన 3 టన్నుల ముగ్గురాయిని బీటెక్ రవి రాత్రికి రాత్రి అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద దోపిడీ జరిగినా పులివెందుల పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని, భవిష్యత్తులో దీనిపై చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
Also Read: ‘మహానాడు’ వేదికగా సరికొత్త రికార్డు.. లోకేష్ బాధ్యతలపై ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు!