YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని సందర్శించారు. టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులతో జరిపిన దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘జంగిల్ రాజ్’ (అరాచక పాలన) సాగిస్తోందని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని, ఇక్కడ జోగి రమేష్ ఇంటిపై జరిగిన విధ్వంసాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘వచ్చేది మా ప్రభుత్వమే. అన్యాయమైన ఆఫీసర్లు, పోలీసులు, నాయకులను బోనులో పెడతాం. వారికి శిక్ష తప్పదు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేది చంద్రబాబు ఆడుతున్న పచ్చి అబద్ధమని, దీనిని సీబీఐ రిపోర్ట్ సైతం తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి కేంద్ర సంస్థలు ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశాయని గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచేలా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్ వెల్లడించారు. సీబీఐ చార్జ్షీట్ ప్రకారం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జూలైలో తిరస్కరించిన ట్యాంకర్లను దొడ్డిదారిలో లోపలికి రప్పించి వాడారని ఆరోపించారు. జంతువుల కొవ్వు ఉందనే విషయాన్ని ఏ ల్యాబ్ రిపోర్ట్ చెప్పలేదని, ఇది పూర్తిగా చంద్రబాబు సృష్టేనని ఆయన స్పష్టం చేశారు. తప్పులు చేస్తూ ఇతరులపై నిందలు వేయడం కూటమి నేతలకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.
Read Also: YS Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. కార్యకర్త మృతి!