బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా బలమైన ప్రభావం ఉంది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గం బొత్స రాజకీయానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రస్తుతం శాసనమండలి విపక్షనేతగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవం, పార్టీపై పట్టును దృష్టిలో పెట్టుకుంటే… ఆయన కుమార్తె బొత్స అనూష రాజకీయ రంగంలో అడుగుపెట్టడం అనివార్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
గత కొద్దిరోజులుగా బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలు,ప్రజా సమస్యలపై స్పందన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది సాధారణ కార్యకర్త స్థాయిని మించి, భవిష్యత్ రాజకీయ పాత్రకు స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
గరివిడి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఆమె రాజకీయ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నిత్యం పార్టీ కార్యకర్తలతో నేరుగా టచ్లో ఉంటూ, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ ఆమె చురుకైన రాజకీయ నాయకురాలిగా ముందుకు సాగుతున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఘన విజయం సాధించడంతో ఆమె రాజకీయ బలం మరింత స్పష్టమైంది. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో రాష్ట్రస్థాయి నాయకత్వం నుంచి కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆమె నిర్వహించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కేక్ కటింగ్తో పాటు కార్యకర్తలతో కలిసి చేసిన జన్మదిన సంబరాలు గ్రాండ్ లుక్ను సంతరించుకున్నాయని పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం జరిగిన పార్టీ కీలక సమావేశాలకు తండ్రితో పాటు ఆమె హాజరవుతుండటంతో, చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలను ఆమె చూసుకుంటున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
ఇటీవల రాష్ట్రస్థాయిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బొత్స సత్యనారాయణ బిజీగా ఉండటంతో, కార్యకర్తలకు అందుబాటులో కూతురు అనూష ఉంటారన్న సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ‘మన కుటుంబం – మన కార్యకర్త’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. గ్రామగ్రామాలుగా పర్యటిస్తూ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, “మీకు నేను అండగా ఉంటాను” అంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గంలో తండ్రి బాధ్యతలను కూతురు అనూషే నిర్వర్తిస్తున్నారన్న సంకేతాలను బొత్స సత్యనారాయణ ప్రత్యక్షంగానే కార్యకర్తలకు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె గ్రౌండ్ లెవల్లో యాక్టివ్గా వ్యవహరిస్తూ, ప్రజల మధ్యే తిరుగుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగడుతున్న తీరు చూస్తుంటే చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలు ఆమెకు దాదాపుగా ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇటీవల జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ సమావేశంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్రావు మాట్లాడుతూ, తనకు భీమిలి నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అప్పగించిందని, చీపురుపల్లిని అనూషే చూసుకుంటారని బహిరంగంగా ప్రకటించడం రాజకీయంగా మరింత స్పష్టతనిచ్చింది. దీంతో అనూష రాజకీయ అడుగులకు లైన్ క్లియర్ అయిందన్న వ్యాఖ్యలు జోరందుకున్నాయి.
మరోవైపు తల్లి బొత్స ఝూన్సీ బాటలోనే తనయరాలు నడవాలన్న సెంటిమెంట్ను కొనసాగించాలన్న ఆలోచనలోనూ ఆమె ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గుర్ల లేదా గరివిడి మండలాల నుంచి జడ్పిటీసీగా పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తల్లి, మేనమామలు కొనసాగించిన జడ్పీ పీఠాన్ని మళ్లీ తమ కుటుంబ ఖాతాలోనే వేసుకోవాలన్న వ్యూహంతోనే ఆమె అడుగులు వేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సమన్వయం చేయడంలోనూ ఆమె విజయవంతమవుతున్నట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే, అనూష రాజకీయ అడుగులు క్రమంగా బలపడుతూ, చీపురుపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.