YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్వర్పై ఇండియా బ్లాక్ ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి వైకాపా మద్దతు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైకాపా చేసిన ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని జగన్ ‘దొంగ ఏడుపులు’ ఏడుస్తున్నారని విమర్శిస్తూ.. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలని షర్మిల పేర్కొన్నారు. వైకాపా ఎంపీలందరూ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి సంతకాలు చేయాలని, అభిశంసన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలని ఆమె సవాల్ విసిరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే దమ్ము జగన్కు ఉందా అని ఆమె ప్రశ్నించారు. కేవలం సాకులు చెప్పడమే కాకుండా, ఎన్నికల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని షర్మిల స్పష్టం చేశారు. ఈ సవాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈవీఎంల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
Also Read: తిరుపతి ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన షాపులు!