YS Sharmila: సీఎం జగన్ను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈసారి వైసీపీకి ఓటు వేస్తే జగన్ ప్రజలను కూడా అమ్మేస్తారని విమర్శల వర్షం కురిపించారు. జగన్ గతంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. మరోసారి ప్రజల జగన్ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ పాలనపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి రాగానే 2.25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు అది ఏమైందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని మండిపడ్డారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు కానీ.. జగన్ మాత్రం నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ఆరోపించారు.
నాలుగున్నరేళ్లు గడిచిన తర్వాత.. ఎన్నికలకు ముందు హడావుడిగా ఉద్యోగాల నోటిఫికేష్లను విడుదల చేశారని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఆ ప్రక్రియ ఎలాగో పూర్తి కాదనే నమ్మకంతోనే జగన్ ఈ నోటిఫికేషన్లు విడుదల చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
మద్యపాన నిషేధమంటూ జగన్ అధికారంలోకి వచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారన్నారు. నాసిరకం మద్యం అమ్ముతూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని జగన్పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని రైతులు అప్పులపాలయ్యారని ఆరోపించారు.
Also Read: CM Jagan: చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే: జగన్
అమ్మఒడి పథకం పేరుతోనూ జగన్ మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఒక్క ఆడబిడ్డకే అమ్మఒడి ఇస్తే.. ఇంట్లో రెండో బిడ్డ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ రెండో బిడ్డను ఎలా చదివిస్తారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు.