YS Sharmila: వైజాగ్ కు ఈరోజు పీఎం మోడీ వస్తున్న విషయం తెల్సిందే. అయితే పీఎం నోట ఈ ఒక్కమాట చెప్పించండి అంటూ వైఎస్ షర్మిళ ట్వీట్ చేశారు. ఇప్పటికే పీఎం రాక సంధర్భంగా వైజాగ్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ ప్లెక్సీలు సైతం వెలిశాయి.
వైజాగ్ లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని మోడీ నేడు రానున్నారు. అయితే ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలు భారీగా వైజాగ్ కు చేరుకుంటున్నారు. అయితే ప్రధానికి ఈ ఒక్క మాట చెప్పి ఒప్పించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు వైఎస్ షర్మిళ, సీఎం చంద్రబాబును కోరారు. ఇంతకు షర్మిళ మాట ఏమిటో తెలుసుకుందాం.
షర్మిళ తన ట్వీట్ ద్వారా చంద్రబాబు గారూ.. మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని తెలిపారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అంటూ నాడు మోడీ మాటిచ్చిన విషయాన్ని షర్మిళ గుర్తు చేశారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని ఆమె విమర్శించారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని ఏపీలో కట్టలేదన్నారు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని, 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదన్నారు. కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదంటూ విమర్శల వర్షం కురిపించారు షర్మిళ.
Also Read: AP Intermediate Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్షలు ఇక లేవట!
విశాఖకు వస్తున్న ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని ఆమె కోరారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండి అంటూ కూడ షర్మిళ కోరారు. మరి షర్మిళ ట్వీట్ కి కూటమి రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.
చంద్రబాబు గారు..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు… https://t.co/3HJmcLonTd
— YS Sharmila (@realyssharmila) January 8, 2025