YS Jagan Tweet : ఏపీలో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగుల మెయిన్స్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, వారిలో ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులు కూడా చేరారంటూ విమర్శలు చేశారు. కొన్ని వారాలుగా.. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. వాటిని పట్టించుకోకుండా.. ప్రభుత్వం పరీక్షలను నిర్వహించింది. దీంతో.. ఈ విషయంపై కొందరు నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. వారికి జగన్ మద్ధతు ప్రకటించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి కొన్ని జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి, చివరకు వారిని నట్టేటా ముంచారంటూ ఆరోపించారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాప్తులను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మోసపూరిత ప్రకటన చేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియో ఒకటి లీక్ చేస్తూ డ్రామాలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులతో లాఠీఛార్జి చేయించి అమానుషంగా ప్రవర్తించారని, ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొ ఉదాహరణ మాత్రమే అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణమని అన్నారు.
1. @ncbn గారూ… నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.
2. మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం…
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 23, 2025
తమ వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం మోసమేనన జగన్.. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి, అసలు దాని గురించి పట్టించుకోకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి, జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6 లక్షలమంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమే అంటూ ఆగ్రహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట, వీరిని వేరే డిపార్ట్మెంట్లకు సర్దుబాటు చేసి, అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోతపెట్టడమూ చంద్రబాబు మోసానికి ఉదాహరణ అన్నారు.
నిరుద్యోగ భృతి అని, నెలనెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం, తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో 18 వేల మందిని, ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలోనూ పనిచేస్తున్నవారిని తొలగించారని విమర్శించారు. వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడము కూడా చంద్రబాబు చేస్తున్న మోసాల్లో భాగమే అన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే కాదా అని ప్రశ్నించి ఆయన.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అంటూ ఉన్న పీఆర్సీ ఛైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్సీ ఇంతవరకూ వేయకపోవడమేమిటని నిలదీశారు.
ఒకటో తేదీనే జీతాలు అంటూ, ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత ప్రతినెలా ఉద్యోగులు ఎదురు చూసేలా చేస్తున్నారని మండిపడిన జగన్.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్లో పెట్టడం కూడా అన్యాయమే అన్నారు. ట్రావెల్ అలవెన్స్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్మెంట్.. అన్నీ పెండింగ్లో పెట్టడంకూడా ఇంకో అన్యాయమే అంటూ వ్యాఖ్యానించారు.
Also Read : Nagababu: నాగబాబు మాటేంటి? సెంట్రల్కి వెళ్తారా?
ఉద్యోగస్తులకు సంబంధించిన వారి జీఎల్ఐ, జీపీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, ఈ మోసాలకు, ఈ అన్యాయాలకు కేరాఫ్గా మారిన చంద్రబాబు నాయుడు.. వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారని, పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రజా పోరాటాలకు ఎప్పుడూ వైసీపీ తోడుగా నిలుస్తుందని తెలిపారు.