ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి.బడ్జెట్ మీద అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రతిపక్ష వైసీపీ.. కల్తీ నెయ్యి, తిరుమల లడ్డూ వ్యవహారం, కల్తీ పాల ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నది.ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చ జరపాలని ఉభయసభల్లోనూ వైసీపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నది. లడ్డూ కల్తీపై చర్చకు సమయం ఇచ్చాక కూడా మళ్లీ మళ్లీ చర్చకు పట్టుబట్టడం సరికాదని కూటమి సర్కార్ మండిపడుతున్నది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల దేవస్థానంలో లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. ఇదే విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తుచేస్తున్నది. అసెంబ్లీలో చర్చ సమయంలో ఇదే విషయాన్ని మంత్రినారాలోకేశ్ ప్రశ్నించారు. మార్కెట్లో నెయ్యి కిలో రూ.1000 పలుకుతుండగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యి రూ.360కు తెచ్చినట్టు లెక్కలు చూపించారని.. అప్పుడు అది ఒరిజినల్ నెయ్యి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి వైసీపీ సభ్యుల నుంచి సరైన సమాధానం రాలేదు. నెయ్యి కల్తీ అంశంలో ప్రతిపక్ష వైసీపీ కొత్త రాగం ఎంచుకున్నది. చంద్రబాబుకు సంబంధించిన కంపెనీ హెరిటెజ్కు సంబంధం ఉందంటూ కొత్త వాదననె తెరమీదకు తీసుకొచ్చింది.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన దిగిపోయే సమయంలో తిరుమలకు నెయ్యి సప్లయ్ చేసే కాంట్రాక్టును.. హెరిటెజ్ దక్కించుకున్నదని, ఇందాపూర్-హెరిటెజ్ కాంట్రాక్టు దక్కించుకున్నదని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. దీనికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.హెరిటెజ్ నుంచి కేవలం పాలు, పెరుగు మాత్రమే సరఫరా చేస్తున్నట్టు టీడీపీ బదులిచ్చింది. అసలు హెరిటెజ్కు నెయ్యికి సంబంధం లేదని చెబుతోంది. కేవలం వైసీపీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొత్త డ్రామాను తెరమీదకు తెచ్చిందని టీడీపీ విమర్శలు చేస్తున్నది. వైసీపీ అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే లడ్డూ కల్తీ నెయ్యి మీద సీఎం చంద్రబాబు వేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాక మరోసారి నిజం బట్టబయలు అవుతుందని టీడీపీ చెబుతోంది.
Telangana Endowments: తెలంగాణ దేవాదాయశాఖలో వింత పరిస్థితి.. 6నెలలుగా పెండింగ్లో కీలక ఫైళ్లు..!
కాగా, ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం సంక్షేమం, విద్యా, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, రాజధానికి కేటాయించిన నిధుల మీద వైసీపీ పెద్దగా స్పందించలేదు. కేవలం చంద్రబాబు అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టారని డబ్బా కొట్టుకుంటున్నారని వైఎస్ జగన్, మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. అసలు బడ్జెట్ మీద వారికి క్లారిటీ ఉందా? అని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ స్పందించింది. బడ్జెట్ను ఏపీ పురోగతి,భవిష్యత్ నిర్మాణానికి నాందిగా ప్రిపేర్ చేసినట్టు మంత్రులు చెబుతున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే వైసీపీ నేతలకు నచ్చడం లేదని, లడ్డూ కల్తీ విషయంలో రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని వైసీపీ లీడర్లపై అధికార పార్టీనేతలు ఫైర్ అవుతున్నారు.