Supreme Court: మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్వో, వైసీపీ మీడియా విభాగం కార్యదర్శి పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
వైసీపీ మీడియా కన్వీనర్ శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ
నిబంధనలు పాటించకుండా పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ వైసీపీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యింది. శ్రీహరి రిమాండ్ను ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీనిని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. రిమాండ్ పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
తనపై జరుగుతున్నది రాజకీయ కక్షసాధింపు అని, తన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పూడి శ్రీహరి. మంగళవారం సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియాలో పోస్టు ఇష్యూ.. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అంతేకాదు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టులో విచారణ ఉన్నందున సుప్రీం జోక్యం చేసుకోకపోవడంతో శ్రీహరి భవిష్యత్తు హైకోర్టు తీర్పుపై ఆధారపడింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరి. చంద్రబాబు చేతిలో కత్తి పట్టుకుని ఉన్నట్లు యానిమేషన్ చిత్రాలను సృష్టించారు. ఆ తర్వాత వాటిని వైరల్ చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ALSO READ: ఏపీ ఇంధన సంక్షోభం.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల
ఫిర్యాదు ఆధారంగా కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటిన తాడేపల్లిలోని శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ వేసిన పిటిషన్పై ఆయన రిలీఫ్ దక్కలేదు. ఈ కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.