గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పొందిన వేళ.. కోదండరామ్తో పాటు ఆయన టీమ్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వేచి చూసి చూసీ.. గవర్నర్ క్లియరెన్స్ ఇస్తారా? ఇవ్వరా? అనే టెన్షన్కు తెరపడిన వేళ.. కోదండరాం ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టే సంతోషానా… అప్పుడే ఆయనకో ఫోన్ వచ్చింది. నిత్యం తనతో మాట్లాడే.. తెలిసిన ఓ పెద్ద మనిషి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది. వెంటనే లిఫ్ట్ చేశారు కోదండరామ్. తనకు ఎమ్మెల్సీ వచ్చిందని తెలిసి బహుశా శుభాకాంక్షలు తెలిపేందుకు చేసి ఉంటారని భావించారు కోదండరామ్.
కానీ అక్కడ నుంచి వచ్చిన మొట్ట మొదటి ప్రశ్నే ఆయన్ను అవాక్కయ్యేలా చేసింది. ఆ తరువాత వరుసగా సంధించిన ప్రశ్నలు, అనుమానాలన్నీ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ తరువాత నిదానంగా ఆయన ఆ పెద్ద మనిషికి సమాధానమిచ్చారు. ఆ ప్రశ్నల పరంపర, ఆ అనుమానాలు తన మీదున్న అభిమానంతో పాటు.. తన మేలు కోరి చేసినవేనని ఆయనకు తెలుసు. అన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చిన ఆయన.. ఆ పెద్దాయన అనుమానాలను కూడా నివృత్తి చేశారు. అసలేం అడిగారాయన? కోదండరామ్ ఏం చెప్పారు..?
సార్ మీకు ఆ రాజకీయాలు సెట్ అవుతాయా? ఆయనడిగిన తొలి ప్రశ్న ఇదే. కోదండరామ్ సమాధానం ఇచ్చేలోగా మీరు కూడా ఆ కలుషితమైన రాజకీయాల్లో కలిసిపోతున్నారా? మరో అనుమానం. కోదండరామ్ వింటున్నారు సైలెంట్గా. మళ్లీ అవతలి నుంచే.. టెన్షన్ నిండిన అదే స్వరంతో…. ఆ గుంపులో మీరు కూడా కలిసిపోతారా? భిన్నంగా ఉంటారా? అనుమానం, నిలదీత, హితబోధ మూడు కూడిన ఆ ప్రశ్నను సంధించిన తరువాత .. అప్పుడు సమాధానమిచ్చారట కోదండరామ్. నాకు ఎమ్మెల్సీ పదవి అలంకారం కాదని, తను ఇప్పటి వరకు చేస్తున్న పనిని త్వరగా, మరింత ఎక్కువ మందికి మేలు చేసేదిగా ఉండే విధంగా తోడ్పడే ఓ వేదికని.
ఈ ఎమ్మెల్సీ పదవితో ప్రజాక్షేత్రంలోనే కాదు.. మరింత పదునుగా మండలిలో కూడా తన గళం వినిపిస్తానని ఆయన విడమర్చి చెప్పారట. అంటే… మీరు కచ్చితంగా ఇప్పటి రాజకీయాలకు భిన్నంగా ఉంటారు కదా? ఏదో అనుమానం ఇంకా వీడనట్టు.. వెంటాడుతున్నట్టుగా చివర ప్రశ్నగా అడిగారాయన. వందశాతం.. భిన్నంగానే ఉంటాను. ఇప్పటి వరకు తను ఎంచుకున్న పంథాలోనే సాగుతా? సర్కార్కు అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా ప్రజాసేవలో తనవంతు పాత్రను పోషిస్తా..! అని ఆయన మందహాసంతో చెప్పే వరకు అవతలి పెద్దాయనకు మనసు నెమ్మదించలేదట.
ఇప్పుడీ ముచ్చట్లు తెలంగాణ జన సమితి లీడర్ల దగ్గర చర్చకు వస్తున్నాయి. ఇంతకు ఎవరా పెద్దాయన? కోదండరామ్ మేలు కోరే ఆ శ్రేయోభిలాషియైన మేథావి ఎవరు? అనేది కూడా చర్చకు వచ్చిందంట. అందులో కోదండరామ్కు బాగా దగ్గరున్న వాళ్లు మాత్రం.. అది కచ్చితంగా పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నుంచి వచ్చిందని డిసైడ్ అయ్యారట.