YS Jagan: ఏపీ శాసనమండలిలో వైసీపీకి ఎదురులేని బలం ఉంది. మూడింట రెండొంతుల బలం ఉన్నా ఆపార్టీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులు అడ్డుకోలేకపోతుంది.. శాసనసభలో 11 మంది సభ్యులతో చేయగలిగింది ఏమీ లేదని బాయ్కాట్ పేరుతో జగన్ చేతులెత్తేశారు. మండలిలో బిల్లులు పాస్ అవ్వకుండా అడ్డుకోవడానికి తన సైన్యం సరిపోతుందని ధీమాగా కనిపించారు. అయితే అక్కడ కూడా సీన్ రివర్స్ అవుతుంది. బిల్లులను అడ్డుకోలేక పోతుండటంతో మండలిని కూడా బాయ్ కాట్ చేసే యోచనలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారంట. అంటే తాము సభలో లేకుండా బిల్లులు పాస్ చేయించుకున్నారని ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారా?
ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు శాసనమండలి హైలెట్ అవుతూనే వస్తుంది. అసెంబ్లీలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్న శాసనసభ, మండలిల్లో ఆమోదం పొందాలి. అదే ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారపక్షానికి తలనొప్పిగా మారుతుంది. సాధారణంగా అయిదేళ్లు పాలనలో అధికారపక్షానికి మండలిలో ఆధిక్యత పెరుగుతుంది. అదే తర్వాత వచ్చే ప్రభుత్వానికి బిల్లులు పాస్ చేయించుకోవడానికి ఇబ్బందిగా మారేది. అప్పట్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మండలిలో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతుండటంతో.. ఏకంగా మండలినే రద్దు చేయించారు.
తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కున్నారు. శాసనమండలిలో పాస్ అయిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో టీడీపీ స్పీడ్ బ్రేకర్ వేసింది. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అయితే కాలక్రమేణా మండలిలో వైసీపీ బలం పెరగడంతో రద్దు విషయాన్ని కన్వీనియెంట్గా మర్చిపోయారు.
మండలిలో మొత్తం 58 సభ్యులుంటే అందులో 7 మంది నామినేటెడ్ నేతలతో కలిసి వైసీపీకి 39 మంది ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమికి కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇండిపెండిట్లు 4, పీడీఎఫ్ సభ్యులు ఇద్దరున్నారు. వారిలో అత్యధికులు తనకు నమ్మిన బంట్లే అని జగన్ భావస్తున్నారు. ఆ ధీమాతోనే శాసనసభకు ముఖం చాటేసిన జగన్ మండలికి మాత్రం తన టీమ్ని పంపిస్తున్నారు. బిల్లులు పాస్ కాకుండా కూటమి సర్కారును ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పావులు కదపాలన చూస్తున్నారు.
Also Read: చంద్రబాబుకైతే అలా.. గనుల వెంకట్ రెడ్డికి ఇలానా?
అయితే జగన్ ఆలోచనలు బూమరాంగ్ అవుతున్నాయి. నమ్మకున్న సభ్యులు ఆయన్ని నట్టేట ముంచుతున్నట్లు కనిపిస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మండలిలో ప్రభుత్వ బిల్లులు నిరాటంకంగా పాస్ అవుతుండటం వైసీపీ వర్గాలకు పెద్ద షాకే ఇస్తుందంట.. అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్తో నేరుగా ఫైట్ చేయడానికి జగన్కి ఇగో అడ్డం వస్తున్నట్లు కనిపిస్తుంది. స్పీకర్ అచ్చెన్నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుల్ని అధ్యక్షా అని పిలవడానికి ముఖం చెల్లని మాజీ సీఎం.. తనకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వడం లేదన్న సాకు చూపిస్తూ శాసనసభను బాయ్ కాట్ చేస్తున్నారు. మండలిలో మాత్రం చక్రం తిప్పాలని భావిస్తున్నారు.
శాసనసభలో ఆమోదం చెందిన కూటమి బిల్లులు, మండలిలో వైసీపీ వ్యతిరేకిస్తే.. ఆయా బిల్లులు తప్పనిసరిగా ఆగిపోవాల్సిందే. గతంలో టీడీపీ అపోజిషన్గా ఉన్నప్పుడు అదే జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లులకు వ్యతిరేకంగా మండలి సర్కారు తీసుకొచ్చిన బిల్లులు మండలిలో ఆమోదం పొందాయి. వైసీపీకి బలమున్న మండలిలో బిల్లులు ఆమోదం పొందుతుండటంతో వైసీపీ వర్గాల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ సభ్యులు, కూటమికి మద్దతు ఇస్తున్నారా? లేకపోతే జగన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో లేకపోవడంతో బిల్లులు పాసవుతున్నాయా? బిల్లులపై చర్చ సమయంలో సభ్యులు వాకౌట్ అవుతున్నారా? కొందరు కూటమి వైపు వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నారా?ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు మండలిని బాయ్కాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట . తాము సభలో లేకపోవడం వల్లే ప్రభుత్వం బిల్లులు పాస్ చేయించుకుందని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారంట. ఆ క్రమంలో వైసీపీ శాసనమండలిని కూడా బాయ్ కాట్ చేస్తే పూర్తిగా చేతులెత్తేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.