Hybrid Cars: పెట్రోల్ రేట్లు చూస్తేనేమో సెంచరీ దాటి పరుగులు పెడుతున్నాయి.. సరే పోనీ ఎలక్ట్రిక్ కార్లు కొందామంటే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి? మధ్యలో ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఇలాంటి టెన్షన్లు మనల్ని వదలడం లేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు హైబ్రిడ్ కార్ల వైపు మళ్లింది. అటు పెట్రోల్ పవర్, ఇటు ఎలక్ట్రిక్ మైలేజ్.. ఈ రెండింటి కలయికతో మన జేబుకు చిల్లు పడకుండా ఉండబోతోంది. అందుకే ప్రముఖ కార్ల కంపెనీలన్నీ త్వరలో బెస్ట్ హైబ్రిడ్ మోడల్స్ను మార్కెట్లోకి వదలడానికి రెడీ అయిపోయాయి. ఈ ఏడాది మన ముందుకు రాబోతున్న ఆ టాప్-8 హైబ్రిడ్ కార్ల సంగతులేంటో ఒకసారి చూసేద్దాం రండి..
హోండా నుంచి బాగా పాపులర్ అయిన ఎలివేట్ ఇప్పుడు హైబ్రిడ్ రూపంలో వస్తోంది. ఇప్పటికే హోండా సిటీలో హైబ్రిడ్ ఉన్నా, ఎలివేట్ కోసం ప్రత్యేకంగా 1.5 లీటర్ ఇంజిన్ను సెట్ చేశారు. దీనికి లైట్ వెయిట్ బ్యాటరీ, పవర్ఫుల్ మోటార్లను జత చేయడంతో మైలేజ్ విషయంలో ఇది సంచలనం సృష్టించబోతోంది. సిటీ రోడ్లపై హాయిగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
టొయోటా హైరైడర్ అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే ప్లాట్ఫారమ్పై 7 సీటర్ మోడల్ రాబోతోంది. ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణించడానికి వీలుగా, పొడవుగా ఉండబోతోంది. ఇందులోనూ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ ఉంటుంది. ఇదే బాటలో మారుతి సుజుకి కూడా గ్రాండ్ విటారా 7 సీటర్ వెర్షన్ను లాంచ్ చేసే ప్లాన్లో ఉంది. పెద్ద ఫ్యామిలీకి అదిరే మైలేజీ ఇచ్చే కారు కావాలంటే వీటికి తిరుగుండదు.
కియా మోటార్స్ తన గ్లోబల్ హిట్ మోడల్ సోరెంటోను మన దేశానికి తగ్గట్టుగా మార్పులు చేసి తెస్తోంది. ఇందులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ ఉండబోతోంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటూనే.. టాటా సఫారీ, మహీంద్రా XUV 7XO లాంటి హేమాహేమీలకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
Also Read: ఏంటి భయ్యా నిజమా.. రూ.25వేల లోపే బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలా? డోంట్ మిస్!
ఆటోమొబైల్ మార్కెట్లో క్రెటాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే క్రెటాలో హైబ్రిడ్ వెర్షన్ రావడం విశేషం. కొత్త డిజైన్తో పాటు 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ను ఇందులో పెడుతున్నారు. ఇప్పుడున్న పెట్రోల్ క్రెటా కంటే ఇది చాలా ఎక్కువ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
మళ్లీ డస్టర్ వస్తోంది.. అదీ సరికొత్త హైబ్రిడ్ అవతారంలో. కొత్త తరం డస్టర్లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు అదిరిపోయే హైబ్రిడ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇది 160hp పవర్ను ఇస్తూనే, మైలేజీలోనూ తగ్గేదేలే అంటోంది. రఫ్ రోడ్లపై కూడా దూసుకుపోయే డస్టర్ లవర్స్కు నిజంగా ఇది గుడ్ న్యూస్ లాంటిదే.
డస్టర్ ప్లాట్ఫారమ్నే వాడుకుంటూ నిస్సాన్ టెక్టాన్ అనే ఎస్యూవీని తీసుకువస్తోంది. డస్టర్లో ఉండే అవే ఫీచర్లు, అదే హైబ్రిడ్ ఇంజిన్ ఇందులోనూ ఉండబోతున్నాయి. స్టైలింగ్ పరంగా మాత్రం నిస్సాన్ తన మార్క్ చూపించబోతోంది. ఈ కారు భారత్లో విడుదల కావడానికి మరింత ఎక్కువ సమయం పట్టేలా ఉంది.
ఎంజీ మోటార్స్ ఈసారి ఒక అడుగు ముందుకేసి ప్లగ్ ఇన్ హైబ్రిడ్(PHEV)ను పరిచయం చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. కేవలం బ్యాటరీ మీదనే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే సిటీలో ఆఫీసు పనులకు అసలు పెట్రోలే అవసరం లేదన్నమాట. దీని పవర్ కూడా 197 hpగా ఉండబోతోంది.
అసలు జనాలు హైబ్రిడ్ కార్ల వెంట ఎందుకు పడుతున్నారంటే.. పెట్రోల్ కార్లలాగా మైలేజ్ తక్కువ ఉంటుందనే బాధ లేదు. అలాగని ఎలక్ట్రిక్ కార్లలాగా ఛార్జింగ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ కార్లు వాటంతట అవే ఛార్జ్ అవుతూ, మైలేజీని పెంచుతాయి. లాంగ్ జర్నీలు చేసే వారికి, సిటీలో తిరిగే వారికి ఇదొక పర్ఫెక్ట్ ఛాయిస్. అందుకే 2026లో ఈ హైబ్రిడ్ కార్లు భారత ఆటోమొబైల్ మార్కెట్ను ఒక ఊపు ఊపబోతున్నాంటున్నారు నిపుణులు.
Also Read: పెట్రోల్ బంకులతో పనిలేదు.. కిలోమీటరుకు కేవలం రూ.2.50 ఖర్చుతో రాజాలా తిరగండి!