Bihar Bans Caste Stickers on Vehicles: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఆయా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇకపై వాహనాలపై కులాలకు సంబంధించిన పేర్లు, స్టిక్కర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. కార్లు, బైక్లు, ఇతర వాహనాలపై బ్రాహ్మణ, క్షత్రియ, యాదవ్ లాంటి కుల పేర్లు కనిపిస్తే జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ మేరకు బీహార్ రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆదేశాలు జారీ చేసింది.
నెల రోజుల గడువు విధించిన ప్రభుత్వం
వాహన యజమానులు తమ వాహనాలపై ఉన్న కుల సంబంధిత రాతలు, స్టిక్కర్లను ఒక నెలలోగా తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత కూడా వాటిని తొలగించకపోతే రూ. 2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని వివిధ సెక్షన్ల ప్రకారం ఈ జరిమానాలు అమలు చేయనున్నారు. సెక్షన్ 177 కింద రూ. 500 వరకు, సెక్షన్ 179 కింద రూ. 2,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.
వాహన యజమానులు ఆలస్యం చేయకుండా వెంటనే స్టిక్కర్లు తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా రవాణా అధికారులకు ప్రత్యేక సూచనలు పంపించారు. ప్రతి జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. గడువు పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకోనున్నారు.
బీహార్లోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో వాహనాలపై కులం, సంఘం లేదా రాజకీయ గుర్తింపులతో స్టిక్కర్లు పెట్టడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇవి సామాజిక విభజనలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తూ ప్రభుత్వం ఇప్పుడు కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇలాంటి విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
అటు ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను కూడా బీహార్ ప్రభుత్వం ఆధునీకరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ముఖ్య కూడళ్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఆధునిక ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయనున్నారు. పాట్నా, గయా, భాగల్పూర్, ముజఫర్పూర్, దర్భంగా లాంటి ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థను మొదటి దశలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ఈ కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను ఆటోమేటిక్గా గుర్తిస్తాయి. రెడ్ సిగ్నల్ దాటడం, అతివేగంగా వెళ్లడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి నిబంధనల ఉల్లంఘనలను వెంటనే రికార్డు చేస్తాయి. ఈ ఏఐ కెమెరాలు రియల్ టైమ్ వీడియో అనలిటిక్స్ సాయంతో పని చేస్తాయి. ఉల్లంఘన జరిగిన వెంటనే ఆటోమేటిక్ ఇ-చలాన్ జారీ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా ఇందులో భాగం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ ఒకే రాష్ట్ర కమాండ్ సెంటర్తో అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ నిర్వహించనున్నారు.
Read Also: డాష్ బోర్డ్ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అలర్ట్ కాకపోతే అంతేసంగతులు!