FASTag ‘One Tag’ Facility Launched: ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ మార్చాల్సిన అవసరం లేకుండా ‘వన్ ట్యాగ్’ పేరుతో కొత్త పోర్టబిలిటీ సదుపాయాన్ని ప్రారంభించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు వాహన యజమానులు తమ ఫాస్టాగ్కు లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ను మార్చాలంటే కొన్ని సందర్భాల్లో కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సి వచ్చేది. పాత స్టిక్కర్ను తొలగించి కొత్తదాన్ని వాహనానికి అతికించాల్సిన ఉండేది. కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ ట్యాగ్’ సదుపాయంతో ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది.
కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం, వాహనదారులు తమ దగ్గర ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్ను కొత్త బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే, బ్యాంకు ఖాతా మారిన ప్రతిసారీ కొత్త ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం ఉండదు. వాహనంపై ఉన్న పాత ఫాస్టాగ్ స్టిక్కర్ను అలాగే ఉంచుకుని, దాన్ని కొత్త అకౌంట్ కు లింక్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో కొత్త ట్యాగ్ కోసం దరఖాస్తు చేయడం, స్టిక్కర్ను తొలగించడం లాంటి రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. వాహనదారులకు కొత్త విధానం మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఫాస్టాగ్ అనేది వాహనానికి అతికించే స్టిక్కర్ కావడంతో, దాన్ని పదేపదే మార్చడం కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అదే ట్యాగ్ను కొనసాగించే అవకాశం రావడంతో ప్రక్రియ సులభం కానుంది.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సిన పరిస్థితిని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు వేచి ఉండే సమయాన్ని 10 సెకన్లలోపు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఫాస్టాగ్ అమలుతో టోల్ చెల్లింపులు ఇప్పటికే వేగవంతమైనప్పటికీ, ట్రాఫిక్ రద్దీ కారణంగా కొన్నిచోట్ల ఆలస్యం జరుగుతోంది. దీన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
టోల్ ప్లాజాల దగ్గర వాహనాలను పూర్తిగా ఆపాల్సిన అవసరం లేకుండా టోల్ వసూలు చేసే విధానంపైనా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పనిచేస్తోందని గడ్కరీ తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల దగ్గర రద్దీ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతుండగానే టోల్ చెల్లింపు జరిగేలా సాంకేతికతను ఉపయోగించనున్నారు. రోడ్డు రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మెరుగైన ఎక్స్ పీరియెన్స్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు.
Read Also: బ్రిక్స్ కోసం ఢిల్లీకి భారీ భద్రత.. రోడ్లే కాదు, ఎయిర్ స్పేస్ పైనా పరిమితులు!