Hyundai Testing 3 New SUVs: భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు హ్యుందాయ్ సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా SUV విభాగంలో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీ మూడు కొత్త మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ కార్లు ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో ఒక ఎలక్ట్రిక్ SUV, ఒక CNG మిడ్ సైజ్ SUV, అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్న న్యూ జనరేషన్ క్రెటా ఉన్నాయి.
తొలుత ఇండియన్ మార్కెట్ లోకి హ్యుందాయ్ కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని తీసుకురానుంది. 4 మీటర్ల లోపు సెగ్మెంట్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. టాటా నెక్సాన్ EV లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. ఈ వెహికల్ గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఇన్స్టర్ EV ఆధారంగా రూపొందుతున్నప్పటికీ, భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలో బాక్సీ డిజైన్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, రగ్గడ్ లుక్ లాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. బ్యాటరీ పరంగా 42kWh, 49kWh ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. ఈ మోడల్ ను దీపావళి వరకు మార్కెట్ లోకి తీసుకురావాని హ్యుందాయ్ భావిస్తోంది.
ఇక రెండో మోడల్ బేయాన్ SUV. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బేయాన్ ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ SUV పొడవు సుమారు 4.2 మీటర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. పెట్రోల్ ఇంజిన్ తో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఇందులో ఉండనున్నాయి. ఇది CNG ఆప్షన్ తో వచ్చే తొలి హ్యుందాయ్ SUVగా గుర్తింపు పొందనుంది. ఇప్పటి వరకు హ్యుందాయ్ SUVలలో CNG ఆప్షన్ పరిమితంగానే ఉంది. ఈ కొత్త మోడల్ ద్వారా కంపెనీ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. 2027 మార్చి నాటికి ఈ SUVని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
మూడో మోడల్ న్యూ జెనరేషన్ క్రెటా. ప్రస్తుతం క్రెటా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. అయినప్పటికీ, హ్యుందాయ్ ఇప్పటికే దాని నెక్ట్స్ జెనరేషన్ వెర్షన్ డెవలప్ మెంట్ పనులు ప్రారంభించింది. కొత్త క్రెటా పరిమాణంలో మరింత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. వీల్ బేస్ పెరగడం వల్ల వెనుక సీట్లలో ఎక్కువ స్థలం లభించనుంది. అలాగే బూట్ స్పేస్ కూడా పెరగనుంది. ఈ SUVను కొత్త K3 ప్లాట్ ఫారమ్ పై అభివృద్ధి చేయనున్నారు. ఇంజిన్ విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను కొనసాగించే అవకాశం ఉంది. అయితే, ఈసారి పెద్ద మార్పు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ రూపంలో రానుంది. పెట్రోల్ ఇంజిన్కు ఎలక్ట్రిక్ మోటార్లు, చిన్న బ్యాటరీ ప్యాక్ను యాడ్ చేసే అవకాశం ఉంది.
Read Also: మహీంద్రా కార్లకు ఎందుకింత డిమాండ్? 5 బలమైన కారణాలు ఇవే!