Mahindra Hikes Vehicle Prices: మహీంద్రా కంపెనీ వాహనాలు మరింత ఖరీదు కానున్నాయి. తన వాహనాల ధరలను పెంచాలాని తాజాగా కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ తెలిపిన ప్రకారం, మొత్తం SUVలు, కమర్షియల్ వాహనాలపై గరిష్టంగా 2.5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. అయితే, సగటున చూస్తే ఈ పెంపు సుమారు 1.6 శాతం వరకు ఉంటుంది.
మహీంద్రా కార్ల ధరల పెంపుకు ప్రధాన కారణం ముడిసరుకు ఖర్చులు పెరగడం, తయారీ వ్యయాలు ఎక్కువ కావడం అని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండటంతో, ఈ భారాన్ని కొంతవరకు వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని మహీంద్రా వివరణ ఇచ్చింది.
ఈ కొత్త ధరలు కంపెనీకి చెందిన అన్ని వాహనాలకు వర్తిస్తాయి. అంటే, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలే కాకుండా, ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఈ పెంపు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా XUV 3XO EV, XEV 9S, BE 6, XEV 9e లాంటి ఎలక్ట్రిక్ మోడళ్ల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో కొత్తగా కారు కొనాలనుకునే వారికి కొంత అదనపు భారం పడే అవకాశం ఉంది.
ఇటీవల విడుదలైన XUV7XO విషయంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్కు సంబంధించిన మొదటి 40,000 బుకింగ్ లు ఇప్పటికే ప్రైస్ ప్రొటెక్షన్ లో ఉన్నాయి. అంటే, ఆ బుకింగ్లు పూర్తిగా డెలివరీ అయ్యే వరకు ఈ కొత్త ధరల పెంపు వాటికి వర్తించదు. తర్వాతి బుకింగ్లకు మాత్రమే కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఈ ధరల పెంపు కేవలం ఖర్చుల కారణంగానే జరుగుతోంది. వాహనాల ఫీచర్లు, పనితీరు, మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే, తాజాగా కొనుగోలు చేసే కారు మునుపటిలాగే ఉంటుంది. కానీ, ధర మాత్రమే కొంచెం ఎక్కువ అవుతుంది.
ఇటీవల మహీంద్రా కొన్ని స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కూడా మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. BE 6 బ్యాట్మాన్ ఎడిషన్, XEV 9e సినీలక్స్ ఎడిషన్ వంటి వాహనాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. వీటి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. మున్ముందు విడుదల చేయబోయే కొత్త మోడళ్లపై కూడా కంపెనీ పని చేస్తోంది. విజన్ S, థార్ ఫేస్లిఫ్ట్, స్కార్పియో N ఫేస్లిఫ్ట్ వంటి వాహనాలను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఇవి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
అటు అమ్మకాల పరంగా కూడా మహీంద్రా సత్తా చాటుతోంది. మార్చి 2026లో కంపెనీ 61,000 కంటే ఎక్కువ కార్లను అమ్మింది. దేశంలో అత్యధిక వాహనాలు అమ్మే కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, టాటా తర్వాత మూడవ స్థానంలో నిలిచింది.
Read Also: దేశీ మార్కెట్ లోకి క్రేజీ విన్ ఫాస్ట్ ఈవీ ఎంట్రీ, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?