భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతున్నప్పటికీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV) కార్లపై కూడా ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ ప్రధానంగా లగ్జరీ కార్లకే పరిమితమైనా, ఇప్పుడు మాస్ మార్కెట్, ప్రీమియం సెగ్మెంట్లలోకి కూడా విస్తరిస్తోంది. 2026లో పలు కంపెనీలు తమ కొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ PHEV
మెర్సిడెస్ బెంజ్ తాజాగా ఫేస్ లిఫ్ట్ ఎస్ క్లాస్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో S 450e ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలయికలో ఈ కారు 435 హెచ్పీ శక్తిని, 680 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 22kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే ఈ లగ్జరీ సెడాన్ కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లోనే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. అత్యాధునిక టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లతో లగ్జరీ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టింది.
జేఎస్డబ్ల్యూ మోటార్స్ భారత మార్కెట్లో తన తొలి SUVగా జెటూర్ ట్రావెలర్ C-DM ఆధారిత మోడల్ ను తీసుకురానుంది. ఇది ఫార్చ్యూనర్, MG మెజెస్టర్ లాంటి పెద్ద SUVలకు పోటీగా నిలవనుంది. ఈ SUVలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు రెండు, మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ఆప్షన్ ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లో 27.2kWh, 43.24kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తున్నాయి. పెద్ద బ్యాటరీతో 160 కిలోమీటర్లకు పైగా ఎలక్ట్రిక్ రేంజ్ అందించే సామర్థ్యం ఉంది. భారత మార్కెట్ కోసం ఏ వెర్షన్ను తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జేఎస్డబ్ల్యూ MG మోటార్ కూడా ఈ ఏడాది చివర్లో MG 520 పేరుతో కొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVని విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఇది 7 సీటర్ మోడల్ గా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పనిచేసే ఈ కారు 20.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మోడ్ లో 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. మహీంద్రా XUV700, టాటా సఫారీ లాంటి SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
చైనాకు చెందిన BYD కంపెనీ కూడా భారత మార్కెట్లో తన కొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV ‘సీల్ యు’ను తీసుకురానుంది. ఈ SUVలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 18.3kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో 126 కిలోమీటర్ల వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్ లో ప్రయాణించే అవకాశం ఉంది. 2026 చివరి త్రైమాసికంలో ఈ మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Read Also: భారత్ లో బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!