MG First Plug in Hybrid SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ విప్లవం కొనసాగుతున్న వేళ ఎంజీ మోటార్ ఇండియా మరో కీలక మోడల్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జూలై 16, 2026న తన తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (PHEV)ని భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ప్రస్తుతం ఇండియాలో ఈ సెగ్మెంట్ లో పెద్దగా పోటీ లేకపోవడంతో ఎంజీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఈ కొత్త ఎస్యూవీ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వులింగ్ స్టార్ లైట్ 560 PHEV ఆధారంగా రూపొందింది. అయితే, భారత్ లో ఇది ఎంజీ బ్రాండ్ పేరుతోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ వెహికల్ భారతీయ రోడ్లపై టెస్టింగ్ జరపుకుంటూ కనిపించింది.
ఈ ఎస్యూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం రేంజ్. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు 20.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ఈ రెండు కలిసి సుమారు 195 హార్స్ పవర్ శక్తి, 230 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఎలక్ట్రిక్ మోడ్ లోనే ఈ వాహనం సుమారు 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్యాటరీతో పాటు పెట్రోల్ ట్యాంక్ ను పూర్తిగా ఉపయోగిస్తే మొత్తం 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో భారత మార్కెట్లో అత్యధిక రేంజ్ అందించే ఎస్ యూవీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మూడు వరుసల సీట్లతో ఏడుగురు సౌకర్యంగా కూర్చునే అవకాశం ఉంటుంది.
ఈ ఎస్యూవీ ప్రీమియం అనుభూతిని అందించనుంది. ఇందులో 12.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్టులు లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత మార్కెట్ కోసం 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), వైర్ లెస్ కనెక్టివిటీ లాంటి ఆధునిక సదుపాయాలను కూడా ఎంజీ అందించే అవకాశం ఉంది.
ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది.. చిన్న ప్రయాణాలను పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ తో వెళ్లొచ్చు. దూర ప్రయాణాల సమయంలో పెట్రోల్ ఇంజిన్ పని చేస్తుంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్లపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పోటీ ధరతో ఈ ఎస్యూవీని తీసుకొస్తే, భారత మార్కెట్లో ఐసీఈ వాహనాలు, పూర్తి ఎలక్ట్రిక్ కార్ల మధ్య స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ఎంజీ ఎస్యూవీ భారత మార్కెట్లో మహీంద్రా XUV700, టాటా సఫారీ, జీప్ మెరిడియన్, హ్యుందాయ్ అల్కజార్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Read Also: జూలై 2026లో భారత మార్కెట్లోకి రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. EV ప్రియులకు పండుగే!