Avore EX Electric Bike: భారత్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అవోర్ ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ సిరీస్ అవోర్ EX ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లైనప్లో EX1, EX2, EX2S అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.1,24,999 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. మిడ్ స్పెక్ EX2 ధర రూ.1,45,999 కాగా, టాప్ ఎండ్ EX2S ధర రూ.1,69,999గా ఫిక్స్ చేసింది. కొత్త ఎలక్ట్రిక్ బైక్లో మంచి రేంజ్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, రైడింగ్ మోడ్లు, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.
అవోర్ EX స్పోర్టీ, మస్కులర్ లుక్ తో రూపొందించారు. షార్ప్ బాడీ ప్యానెల్స్, ట్యాంక్ ఎక్స్ టెన్షన్స్, స్లీక్ టెయిల్ సెక్షన్ కారణంగా బైక్కు లైటెస్ట్ లుక్ వచ్చింది. ముందు భాగంలో ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ లతో పాటు ప్రత్యేకమైన ట్యాంక్ లైటింగ్ ఉంది. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా రైడింగ్ పొజిషన్ను రూపొందించారు. అల్లాయ్ వీల్స్ కూడా బైక్ లుక్ను మరింత ప్రీమియంగా మార్చాయి.
అవోర్ EXలో 7 అంగుళాల స్మార్ట్ డిజిటల్ కాక్పిట్ డిస్ ప్లే ఉంది. ఇది బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. టాప్-ఎండ్ EX2Sలో మరిన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో నావిగేషన్, జియో-ఫెన్సింగ్, క్రాష్ అలర్ట్లు, AI ఇంటిగ్రేషన్ లాంటి సదుపాయాలను అందించారు. రైడర్లు ఎకో, సిటీ, స్పోర్ట్, రివర్స్ లాంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
అవోర్ EX1లో 3.24kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. EX2, EX2S వేరియంట్లలో పెద్ద 5kWh IPU X షీల్డ్ బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. ఛార్జింగ్ విషయంలో కూడా కంపెనీ మంచి సదుపాయం అందిస్తోంది. 1,500W ఆన్ బోర్డ్ ఫాస్ట్ ఛార్జర్ ను సాధారణ 5A, 15A ఇంటి విద్యుత్ సాకెట్కు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతానికి కేవలం రెండు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.
EX1 పూర్తి ఛార్జ్ పై 160 కి.మీ వరకు IDC రేంజ్ ఇస్తుంది. 5kWh బ్యాటరీతో వచ్చే EX2 ఒక ఛార్జ్పై 255 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. టాప్-ఎండ్ EX2S మాత్రం ఈ లైనప్లో అత్యధికంగా 260 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుంది. దీంతో రోజువారీ ప్రయాణాలతో పాటు ఎక్కువ దూరం వెళ్లే వారికి కూడా ఈ బైక్ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. EX1, EX2 వేరియంట్లు 7.5kW గరిష్ట పవర్ను అందిస్తాయి. వీటి గరిష్ట వేగం గంటకు 100 కి.మీ.
అవోర్ EX ఎలక్ట్రిక్ మోటార్సైకిల్కు ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ.799 రిఫండబుల్ టోకెన్ చెల్లించి బైక్ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ రద్దు చేస్తే ఈ మొత్తం తిరిగి చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. 2026 సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా డెలివరీలను ప్రారంభించాలని అవోర్ ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!