1st PM E-DRIVE Certified Truck: ఇండియన్ క్లీన్ మొబిలిటీ ప్రయాణంలో కీలక ముందడుగు పడింది. మురుగప్ప గ్రూప్ లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ భారత ప్రభుత్వ PM E-DRIVE పథకం కింద సర్టిఫికేషన్ పొందిన తొలి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ దేశంలోనే తొలి PM E-DRIVE సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్, రైనో 5538 EV 6×4 ట్రాక్టర్ ట్రైలర్ను డెలివరీ చేసింది. భారత్ లోనే అతిపెద్ద సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్కు ఈ రెండు వాహనాలను అందించింది. కంపెనీ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, MD మోంట్రా ఎలక్ట్రిక్ జలజ్ గుప్తా కలిసి ఈ వాహనాలను అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ శ్రీ సత్యా రాజ్ కు అందించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని మరో లెవల్ కు తీసుకెళ్లనున్నట్లు మోంట్రా ఎలక్ట్రిక్ వెల్లడించింది. దేశ క్లీన్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థకు ఈ విజయం కీలక ముందడుగు కాబోతోందని తెలిపింది.
తాజాగా తీసుకొచ్చిన ఈ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలోని లాజిస్టిక్స్, మైనింగ్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలలో విద్యుత్ హెవీ డ్యూటీ ట్రక్కుల అడాప్షన్ ను పెంచుతుందని మోంట్రా ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది. పెద్ద ఫ్లీట్ ఆపరేటర్లు, పారిశ్రామిక వినియోగదారులు పనితీరు, టైమ్ బాండ్, ఫైనాన్షియల్ గా రాజీ పడకుండా సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. తాజాగా సర్టిఫికేషన్ వెహికిల్స్ ద్వారా మరింత సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సరుకు రవాణా వైపు నిర్ణయాత్మక అడుగుగా భావిస్తున్నట్లు వివరించింది.
మొదటి PM E-DRIVE-సర్టిఫైడ్ రైనో 5538 EVని అరుణ్ మురుగప్పన్ ఫ్లాగ్ చేసి అల్ట్రాటెక్కు అందించారు. రూ. 10,900 కోట్ల PM E-DRIVE పథకం ఇ- ట్రక్కుల కోసం రూపొందించిన రూ. 500 కోట్ల అవుట్ లేను కలిగి ఉంది. దీని వల్ల రైనో 5538 EV కోసం ప్రతి వాహనానికి రూ. 9.6 లక్షల వరకు నేరుగా కస్టమర్ కు ప్రయోజనం కలగనుంది. ఈ ప్రోత్సాహకం నిర్వహణ ఖర్చులను తగ్గించడం, ఇంధన ధరల అస్థిరత తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక ఫ్లీట్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
అటు భారతీయ ఆపరేటింగ్ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన రైనో 5538 EV ట్రాక్టర్ ట్రైలర్ రేంజ్ 6×4, 4×2 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. రైనో 5538 EV 4×2 ట్రాక్టర్ ట్రైలర్ బ్యాటరీ స్వాపింగ్, ఫిక్స్ డ్ బ్యాటరీ ఆప్షన్స్ ను కలిగి ఉంది. ఆరు నిమిషాల బ్యాటరీ స్వాప్లు(380 HP) 2000 Nm టార్క్ను అందించే 282 kWhతో వస్తున్నాయి. ఒకే ఛార్జ్ మీద దాదాపు 198 కి.మీ పరిధిని అందిస్తుంది. రైనో 5538 EVలు పోర్టులు, మైనింగ్ కార్యకలాపాలు, సిమెంట్ లాజిస్టిక్స్, స్టీల్ ప్లాంట్లు, సుదూర సరుకు రవాణా కారిడార్లలో బాగా సూటవుతాయని కంపెనీ తెలిపింది. దేశ ప్రధాన ఆర్థిక రంగాలలో ఎలక్ట్రిక్ హెవీ డ్యూటీ ట్రక్కుల విస్తరణను వేగవంతం చేయడానికి మోంట్రా ఎలక్ట్రిక్ కస్టమర్లు, విధాన నిర్ణేతలతో కలిసి పని చేస్తుంది.
Read Also: మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!