Ola S1 X+ with 320KM Range: భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో మరో కీలక ముందడుగు పడింది. ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త S1 X+ 5.2 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ కు ప్రభుత్వ ధృవీకరణ పొందినట్లు ప్రకటించింది. ఈ స్కూటర్ కు మనేసర్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుంచి ఆమోదం లభించిందని తెలిపింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని పరీక్షలను పూర్తి చేసిన తర్వాత ఈ సర్టిఫికేషన్ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ కొత్త స్కూటర్ లో ఓలా సంస్థ స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించింది. తమ మాస్ మార్కెట్ స్కూటర్ సెగ్మెంట్ లో ఈ స్కూర్ అత్యధిక రేంజ్ను అందించే మోడల్గా నిలుస్తుందని కంపెనీ వెల్లడించింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని తెలిపింది. అంతేకాదు, ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వివరించింది.
Ola S1 X+ స్కూటర్ కు 11 కిలోవాట్ మిడ్ డ్రైవ్ మోటార్ ను అమర్చారు. దీని వల్ల మెరుగైన పనితీరు, వేగవంతమైన యాక్సిలరేషన్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి, పట్టణాలకే కాకుండా దూర ప్రాంతాల్లో కూడా ప్రయాణించే వినియోగదారులకు ఈ స్కూటర్ ఉపయోగపడేలా రూపొందించినట్లు వెల్లడించింది.
ఓలా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీ ఈ స్కూటర్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ బ్యాటరీ అధిక శక్తి సాంద్రతను కలిగి ఉండటంతో పాటు మెరుగైన థర్మల్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంటే, బ్యాటరీ వేడెక్కే సమస్యలు తగ్గడంతో పాటు, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం పెరుగుతుందని వివరించింది. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన బ్యాటరీలను భారీ స్థాయిలో మాస్ మార్కెట్ కు తీసుకురావడంలో కీలక ముందడుగు పడినట్లు తెలిపింది. రేంజ్, పనితీరు, భద్రతను ఒకే స్కూటర్ లో అందించేందుకు ఈ మోడల్ ను రూపొందించినట్లు వివరించింది.
ఇక భద్రత పరంగా కూడా ఈ స్కూటర్పై కఠిన పరీక్షలు నిర్వహించినట్లు ఓలా వివరించింది. స్కూటర్ నిర్మాణ భద్రత, బ్యాటరీ పనితీరు, రేంజ్ ధృవీకరణ, నియంత్రణ ప్రమాణాలపై పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ICAT ఆమోదం ఇచ్చినట్లు వివరించింది. CMVR నిబంధనలకు అనుగుణంగా అన్ని ప్రమాణాలు పూర్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ తన భవిష్యత్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ల లో కూడా ఈ 4680 భారత్ సెల్ టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించింది. బ్యాటరీ తయారీ నుంచి వాహన తయారీ వరకు పూర్తి స్వదేశీ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.
Read Also: 1200 కి.మీ రేంజ్.. 3.5 లక్షలు.. భారత మార్కెట్లోకి సూపర్ ఈవీ వచ్చేస్తోంది!