Renault to Launch 7 Models by 2030: రెనాల్ట్ భారత మార్కెట్పై మళ్లీ ఫుల్ ఫోకస్ చేసింది. రాబోయే సంవత్సరాల్లో తన కార్లను మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా కంపెనీ రెండు వేర్వేరు ప్లాట్ ఫారమ్లను ఉపయోగించనుంది. ఈ ప్లాన్ ద్వారా 2030 నాటికి మొత్తం ఏడు మోడళ్లను భారత్ లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో కొత్త ఎస్యూవీలు, ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి.
ఈ కొత్త వ్యూహంలో భాగంగా తొలి ప్లాట్ ఫారమ్ చిన్న, బడ్జెట్ కార్ల కోసం ఉపయోగించబడుతుంది. రూ. 10 లక్షల లోపు ధరలో ఉండే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లను కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేసి, మరింత మెరుగైన ఫీచర్లతో అందించాలనేది కంపెనీ లక్ష్యం. ఈ కొత్త ప్లాట్ఫారమ్ ద్వారా ఫ్యాక్టరీలోనే అమర్చే CNG ఆప్షన్లు, లేటెస్ట్ డిజిటల్ సిస్టమ్లు, మెరుగైన పనితీరు లాంటి అంశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంకో ప్లాట్ఫారమ్ పెద్ద కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించబడింది. ఇది 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న వాహనాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాట్ ఫారమ్పై ఆధారపడి న్యూ జెనరేషన్ SUVలు, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లు తయారు చేయనుంది. ఈ విధానం ద్వారా రెనాల్ట్ భవిష్యత్తులో విద్యుదీకరణ వైపు అడుగులు వేయాలని చూస్తోంది. రెండో ప్లాట్ఫారమ్ కంపెనీకి కీలకం కానుంది. ఎందుకంటే ఇది ఒకే రకం టెక్నాలజీపై ఆధారపడకుండా, పెట్రోల్, హైబ్రిడ్, పూర్తిగా ఎలక్ట్రిక్ లాంటి పలు ఆప్షన్స్ ను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో వినియోగదారులు ఏ విధమైన వాహనాన్ని కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈ ప్లాట్ ఫారమ్ను ఉపయోగించవచ్చు.
రెనాల్ట్ కొత్తగా విడుదల చేయబోయే SUVలు ఈ వ్యూహంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా బ్రిడ్జర్ లాంటి మోడళ్లు కంపెనీకి కొత్త కస్టమర్లను తీసుకురావడంలో సాయపడనున్నాయి. మొదట ఈ మోడల్ పెట్రోల్ ఇంజిన్తో అందుబాటులోకి వచ్చి, తర్వాత ఎలక్ట్రిక్ వేరియంట్గా కూడా మారే అవకాశం ఉంది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడానికి ముఖ్యమైన అడుగు అవుతుంది.
రెనాల్ట్ భారత్ ను కేవలం అమ్మకాల మార్కెట్ గా మాత్రమే కాకుండా, టెక్నాలజీ అభివృద్ధి కేంద్రంగా కూడా మార్చాలని భావిస్తోంది. ఇక్కడి ఇంజనీరింగ్ టీమ్లు సాఫ్ట్ వేర్ అభివృద్ధి, వాహన డిజైన్, కొత్త ఫీచర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి. దీని వల్ల భారత్ గ్లోబల్ స్థాయిలో కంపెనీకి ముఖ్యమైన కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త డ్యూయల్ ప్లాట్ ఫారమ్ వ్యూహం ద్వారా రెనాల్ట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆధునాతన టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడం ద్వారా ఫ్యూచర్ ప్లాన్స్ కు పునాది వేసే ప్రయత్నం చేస్తోంది.
Read Also: బ్రిడ్జర్తో రెనాల్ట్ బిగ్ స్ట్రాటజీ… డస్టర్ కు షాక్ తప్పదా?