August 2026 Car Launches: ఆగస్టు నెలలో ఇండియన్ కార్ మార్కెట్ లోకి సరికొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పెషల్ ఎడిషన్ మోడళ్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కార్ల ధరలు ప్రకటించనుండగా, మరికొన్ని మోడళ్లు తొలిసారి ప్రజల ముందుకు రానున్నాయి. ఎంజీ, మహీంద్రా, స్కోడా, వోల్వో లాంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడల్స్ ను ఈ నెలలో పరిచయం చేయనున్నాయి.
ఎంజీ మోటార్ సైబర్ స్టర్, ఎం9 కౌచర్ ఎడిషన్లను ఆగస్టు 3న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ రెండు స్పెషల్ ఎడిషన్ కార్లకు ఇప్పటికే ప్రీ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఒక్కో మోడల్ ను కేవలం 50 యూనిట్లకే పరిమితం చేయనుంది. ఈ కార్లను ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి రూపొందించారు. బయట డిజైన్ తో పాటు ఇంటీరియర్ లో కూడా ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. అయితే, ఇంజిన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇవి ఎంజీ సెలెక్ట్ డీలర్ షిప్ల ద్వారా మాత్రమే అమ్మనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహీంద్రా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విజన్ ఎస్ కాన్సెప్ట్ SUV ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కంపెనీ తన ప్రస్తుత మోడళ్లకు సంబంధించిన కొన్ని అప్డేట్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. విజన్ ఎస్ కొత్త NU_IQ ప్లాట్ ఫామ్పై రూపొందించబడుతోంది. ఈ ప్లాట్ ఫామ్పై పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లతో పాటు FWD, AWD డ్రైవ్ ట్రెయిన్లను కూడా అందించవచ్చు. ఇటీవల ఈ SUV టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది.
మహీంద్రా స్కార్పియో Nకి మోడల్ ఇయర్ అప్డేట్ రానుంది. ఇది పూర్తి ఫేస్ లిఫ్ట్ కాకపోయినా, పలు కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త వెర్షన్లో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 65W టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు, కొత్త సెంటర్ కన్సోల్, కొత్త అల్లాయ్ వీల్స్ లాంటి అప్డేట్లు ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఆప్షన్లు కొనసాగనున్నాయి.
స్కోడా స్లావియా సెడాన్కు కూడా అప్ డేటెడ్ వెర్షన్ ఈ నెలలో రానుంది. కుషాక్ ఫేస్ లిఫ్ట్ లో కనిపించిన కొన్ని మార్పులను ఈ కారులో కూడా తీసుకురానున్నారు. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ LED లైట్లు, పెద్ద టచ్ స్క్రీన్, కొత్త ఇంటీరియర్, మెరుగైన డ్రైవర్ డిస్ ప్లే లాంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 18న ఈ మోడల్ విడుదలయ్యే అవకాశముంది. ఇందులో 1.0 లీటర్, 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగనున్నాయి.
వోల్వో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ SUV అయిన EX90ను కూడా ఈ నెల చివర్లో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది XC90కు ఎలక్ట్రిక్ వెర్షన్గా వస్తోంది. భారతదేశంలో వోల్వో నుంచి వచ్చే మూడో ఎలక్ట్రిక్ కారు ఇదే. ప్రపంచ మార్కెట్లో ఈ SUV 106kWh బ్యాటరీతో డ్యూయల్ మోటార్ AWD సెటప్ ను అందిస్తోంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉందని కంపెనీ తెలిపింది. చిన్న బ్యాటరీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. భారత మార్కెట్ కోసం పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: MG విండ్సర్ ఔట్.. ఇండియన్ EV మార్కెట్ లో కొత్త చాంపియన్!