TVS iQube Hits One Million Mark: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ టీవీఎస్ మోటార్ కంపెనీ మరో అరుదైన ఘనత సాధించింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (iQube) పది లక్షల యూనిట్ తయారీ మార్క్ ను అందుకుంది. తమిళనాడులోని హోసూర్ ప్లాంట్ ఈ యూనిట్ ను తయారు చేసి విడుదల చేసింది. ఇది టీవీఎస్కు మాత్రమే కాకుండా భారత ఎలక్ట్రిక్ వాహన రంగానికి కూడా కీలక మైల్ స్టోన్ గా భావిస్తున్నారు.
టీవీఎస్ ఐక్యూబ్ ను 2020లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. తక్కువ కాలంలోనే ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. పది లక్షల ఐక్యూబ్ స్కూటర్ల ఉత్పత్తి దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్పేందుకు నిదర్శనం అన్నారు టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ సుదర్శన్ వేణు. ఇంజనీరింగ్, పరిశోధన, సాంకేతిక అభివృద్ధిపై కంపెనీ చేసిన పెట్టుబడుల ఫలితమే ఈ విజయం అన్నారు.
ఐక్యూబ్ ను పూర్తిగా భారత్ లో అభివృద్ధి చేసి తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. కాలక్రమేణా ఈ స్కూటర్ లో పలు కొత్త వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం వివిధ బ్యాటరీ సామర్థ్యాలు, భిన్నమైన రేంజ్ ఆప్షన్లు, కనెక్టెడ్ ఫీచర్లతో ఐక్యూబ్ అందుబాటులో ఉంది. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు తగిన మోడల్ ను ఎంచుకునే అవకాశం పొందుతున్నారు.టీవీఎస్ తన సేల్స్, సర్వీస్ నెట్ వర్క్ ను కూడా విస్తృతంగా పెంచింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,000కు పైగా నగరాల్లో 3,300కు మించిన సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్లు ఐక్యూబ్ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణలో కూడా ఐక్యూబ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ గణాంకాల ప్రకారం, ఐక్యూబ్ వినియోగదారులు ఇప్పటివరకు కలిపి 14.94 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. దీని వల్ల సుమారు 5.22 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగారు. ఈ కార్బన్ ఆదా దాదాపు 2 కోట్లకు పైగా చెట్లను నాటినట్లే పర్యావరణానికి ఉపయోగపడిందని టీవీఎస్ పేర్కొంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి ఎంత మేలు చేస్తున్నాయో మరోసారి స్పష్టమవుతోంది.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా స్వచ్ఛమైన రవాణాను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెరగడం, వినియోగదారుల్లో అవగాహన పెరగడం కూడా ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఐక్యూబ్ సాధించిన పది లక్షల యూనిట్ల మైలురాయి భారత ఎలక్ట్రిక్ వాహన రంగానికి మరో పెద్ద విజయంగా చెప్పవచ్చు.
Read Also: మళ్లీ మార్కెట్ లోకి స్ప్లెండర్ ప్రో క్లాసిక్.. హీరో ప్లాన్ మామూలుగా లేదుగా!