TVS King EV MAX Launch: టీవీఎస్ మోటార్ కంపెనీ ఈవీ మార్కెట్ లో సత్తా చాటేందుకు సరికొత్త మోడల్స్ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే కనెక్టెడ్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను లాంచ్ చేసింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో నేపాల్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ను పట్టణ ప్రాంతాల్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం రూపొందించింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంతో పాటు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో మంచి ఆదాయం వచ్చేలా ఈ వెహికల్ ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లో 11 కిలోవాట్ల మోటార్ ను ఫిక్స్ చేశారు. దీనికి 9.2 kWh సామర్థ్యం కలిగిన LFP లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒక ఫుల్ ఛార్జ్ తో 179 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 3.5 గంటల సమయం పడుతుంది.
ఈ వాహనంలో మూడు రకాల డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఈకో మోడ్ లో గంటకు 40 కిలోమీటర్లు, సిటీ మోడ్లో 50 కిలోమీటర్లు, పవర్ మోడ్లో 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అటు 0 నుంచి 30 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో అందుకుంటుంది. సుమారు 2 ఫీట్ల నీటిలోనూ ఈ వెహికల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది.
ఇక ఈ త్రీ వీలర్ లో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీని ఇందులో అందించారు. దీని ద్వారా మొబైల్ ఫోన్ తో వాహనాన్ని కనెక్ట్ చేసి రియల్ టైమ్ నావిగేషన్, వెహికల్ వార్నింగ్, డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని ఇస్తాయి.
ఈ వాహనానికి కంపెనీ 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీ ప్రకటించింది. నేపాల్ లో టీవీఎస్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన డీలర్ షిప్లలో అమ్మకాలు జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ మోడల్ ను ఇండియాలోకి కూడా తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు తీసుకొస్తారనే విషయాన్ని త్వరలో కన్ఫార్మ్ చేయనున్నట్లు సమాచారం.