New Electric Cars Testing in India: బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలో పరిమిత కారు మోడళ్లు ఉన్నప్పటికీ, భారత్ లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతోంది. ఫిబ్రవరి 2026 అమ్మకాలను పరిశీలిస్తే, ఏకంగా 20,616 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు, త్వరలో మరిన్ని కార్లు మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులకు సంబంధించి పలు కంపెనీలు తమ కార్లను పరీక్షిస్తున్నాయి. వీటిలో ఏ కార్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హోండా ఇటీవల భారత మార్కెట్లో రాబోయే ఎలక్ట్రిక్ SUV టెస్ట్ రన్ ను ప్రారంభించింది. 0 ఆల్ఫా EVగా దీనికి పేరు పెట్టారు. ఇది, భారత్ లో జపనీస్ బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ మోడల్ కాబోతోంది. టోక్యోలో జరిగిన జపాన్ మొబిలిటీ షో 2025లో తొలిసారిగా ఆవిష్కరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో విడుదల కానుంది. హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత్ లో తయారై అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది. మారుతి ఇ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా హారియర్ ఈవీ లాంటి కార్లతో ఇది పోటీ పడనుంది. ఒకే ఛార్జ్ తో 500 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుందని భావిస్తున్నారు.
టాటా సియెర్రా ఈవీ 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. సియెర్రా ఈ ఆల్ ఎలక్ట్రిక్ వేరియంట్, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల మధ్య స్థానంలో ఉంటుంది. ఇది సింగిల్ మోటార్ రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లతో అందించబడుతుందని భావిస్తున్నారు. 55 kWh, 65 kWh బ్యాటరీ ప్యాక్ లతో రానుంది. ఈ EVలో వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్, వెహికల్ టు లోడ్ ఛార్జింగ్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ నెల ప్రారంభంలో మహీంద్రా BE.O7 భారతీయ రోడ్లపై మొదటిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది BE సిరీస్ కింద రెండవ ఎలక్ట్రిక్ మోడల్ కాగా, XEV 9e, BE 6, XEV 9S తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్గా తయారైన నాల్గవ SUV అవుతుంది. 2027లో విడుదల కానున్న దీని పొడవు దాదాపు 4.6 మీటర్లు ఉంటుంది. ఇది INGLO ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్పై రూపొందింది. 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది.
ఇటీవల, గోవాలోని ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లో హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కనిపించింది. ఈ ఆల్ ఎలక్ట్రిక్ మోడల్ భారీగా క్యామోఫ్లేజ్ తో కప్పబడి ఉంది. 16/17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ కనిపించాయి. ఇది 4 మీటర్ల లోపు ఎలక్ట్రిక్ ఎస్యూవీగా రానుంది. ఇది టాటా నెక్సాన్ ఈవీకి ప్రత్యర్థిగా రానుంది. కొత్త హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV, క్రెటా EV కంటే దిగువన స్థానంలో నిలువనుంది. 2026 చివరి నాటికి ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు.
కియా ఇండియా సైరోస్ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్పై పని చేస్తోంది. ఇది గ్రామీణ రోడ్లపై టెస్ట్ రన్ చేస్తూ చాలాసార్లు కనిపించింది. హ్యుందాయ్ ఇన్స్టర్ ప్రేరేపిత K1 ప్లాట్ఫామ్ ఆధారంగా, కియా సైరోస్ EV ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్ తో అందుబాటులో ఉంటుంది. కేరెన్స్ క్లావిస్ EV కంటే దిగువన స్థానంలో ఉంటుంది. దేశంలో కియా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకే ఛార్జ్ పై గరిష్టంగా 369 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. 2026 సెకెండాఫ్ లో విడుదలయ్యే ఈ కారు రూ. 15-20 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Read Also: మారుతి నుంచి మైక్రో ఎస్యూవీ, టాటా పంచ్ కు పోటీ తప్పదా?