Mini Excavator: 21 ఏళ్ల వయసు.. చేతిలో స్మార్ట్ఫోన్, జేబులో బైక్ కీస్, ఫ్రెండ్స్తో కలిసి షికార్లు.. సాధారణంగా ఏ యువకుడినైనా అడిగితే ఇదే లైఫ్ అంటాడు. కానీ ఈ కుర్రాడు మాత్రం రూట్ మార్చాడు. సమాజానికి పట్టిన చీడను వదిలించాలనుకున్నాడు. ప్రాణాలు తీస్తున్న డ్రైనేజీ గుంతల్లోకి మనుషులు వెళ్లకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఐటిఐ చదివిన ఈ కుర్రాడి మెదడులో పుట్టిన ఆలోచన.. ఇప్పుడు ఒక అద్భుత ఆవిష్కరణకు దారితీసింది. ఏలూరు జిల్లా రాజవరం గ్రామానికి చెందిన ఈ లిటిల్ సైంటిస్ట్ సృష్టించిన సెన్సేషన్పై స్పెషల్ స్టోరీ..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో శ్రీరామ గణేష్ యువకుడు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించకపోయినా..తనలోని సృజనాత్మకతకు మాత్రం పేదరికం అడ్డు కాలేదు. పదో తరగతి పూర్తయ్యాక సాంకేతిక రంగంపై ఉన్న మక్కువతో ఐటిఐలో చేరాడు. పుస్తకాల్లోని సూత్రాలను బట్టీ పట్టడం కంటే.. యంత్రాల పనితీరును అర్థం చేసుకోవడంపైనే గణేష్ ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ఐటిఐ పూర్తి చేసిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా..చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలుపెట్టాడు. ఆ గమనింపే ఈరోజు అతడిని ఒక అన్వేషకుడిగా నిలబెట్టింది.
నిత్యం మనం వార్తల్లో చూస్తుంటాం.. భూగర్భ డ్రైనేజీల్లో పూడిక తీయడానికి దిగిన పారిశుధ్య కార్మికులు, అక్కడ పేరుకుపోయిన విషవాయువుల ప్రభావంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోతుంటారు. నాగరికత ఇంతలా అభివృద్ధి చెందినా.. ఇంకా మనుషులు ఆ మురికి గుంటల్లోకి దిగి ప్రాణాలు వదలడం గణేష్ను తీవ్రంగా కలిచివేసింది. మనిషి ప్రాణానికి వెల కట్టలేం.. అలాంటిది ఒక యంత్రం చేయాల్సిన పనిని మనిషి ఎందుకు చేయాలి? అన్న ప్రశ్నే అతడి పరిశోధనకు పునాది వేసింది. పారిశుధ్య కార్మికుల పనితీరును సులభతరం చేస్తూ.. వారి ప్రాణాలకు రక్షణ కల్పించేలా ఏదైనా పరికరాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సంకల్పం నుండే పుట్టిందే రిమోట్ కంట్రోల్డ్ మినీ ఎక్స్కవేటర్.
సాధారణంగా ఎక్స్కవేటర్లు అంటే భారీ పరిమాణంలో ఉంటాయి. కానీ భూగర్భ డ్రైనేజీలు ఇరుగ్గా ఉంటాయి. అందుకే గణేష్.. డ్రైనేజీ పైపుల లోపలికి సులభంగా వెళ్లగలిగేలా ఒక చిన్నపాటి ఎక్స్కవేటర్ను డిజైన్ చేశాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేస్తుంది. అంటే కార్మికుడు డ్రైనేజీ గుంతలోకి దిగాల్సిన అవసరమే లేదు. రోడ్డుపై నిలబడి రిమోట్ ద్వారా యంత్రాన్ని లోపలికి పంపవచ్చు. ఈ మినీ ఎక్స్కవేటర్ డ్రైనేజీలోని అడ్డంకులను.. పేరుకుపోయిన పూడికను చాకచక్యంగా బయటకు తీస్తుంది. ఇది కేవలం యంత్రం మాత్రమే కాదు.. ఎంతోమంది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపే ఆశల కిరణం. ఇప్పటికే ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించిన గణేష్.. దీనికి కెమెరాలు కూడా అమర్చుతున్నాడు. తద్వారా లోపల ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో బయట నుండే స్క్రీన్ ద్వారా చూసే అవకాశం కలుగుతుంది. డ్రైనేజీ క్లీనింగ్ రంగంలో ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
గణేష్ ప్రతిభ ఇక్కడితో ఆగిపోలేదు. శ్రామికుల కష్టాన్ని గుర్తించడంలో అతడు ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం నిర్మాణ రంగ కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన ఇసుక జల్లించే యంత్రాన్ని తయారు చేసే పనిలో ఉన్నాడు. సాధారణంగా ఇసుకను జల్లెడ పట్టడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఆ కష్టాన్ని తగ్గించడానికి తక్కువ సమయంలో ఎక్కువ ఇసుకను జల్లెడ పట్టేలా ఒక పరికరాన్ని రూపొందిస్తున్నాడు. ఇది ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. కలలకు వయసు అడ్డం కాదని, సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని గణేష్ నిరూపిస్తున్నాడు.
శ్రీరామ గణేష్ ఆవిష్కరణలు చూసి రాజవరం గ్రామస్థులే కాదు.. జిల్లా అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఐటిఐ చదివిన ఒక కుర్రాడు ఇంతటి అధునాతన యంత్రాలను తయారు చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ఖర్చులతో లభించిన వనరులతోనే ఈ స్థాయికి చేరుకున్న గణేష్కు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే.. భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే మరెన్నో అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంది.
ఆలోచనకు ఆచరణ తోడైతే ఆశయానికి శ్రమ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో శ్రీరామ గణేష్ నిరూపించాడు. 21 ఏళ్ల వయసులోనే సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తున్న ఈ యువ కిశోరం, నేటి యువతకు ఒక గొప్ప రోల్ మోడల్. పారిశుధ్య కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు అతడు చేసిన ఈ రోబో ప్రయత్నం విజయవంతం కావాలని, ప్రభుత్వం అతడిని ప్రోత్సహించాలని ఆకాంక్షిద్దాం.
Also Read: రాడర్లకే దొరకదు అనుకున్నారు.. ఇరాన్ ఇచ్చి పడేసింది, అమెరికా F-35 కథ క్లోజ్?