ఉచిత బస్సుపై ప్రతిపక్షాలు నోరు పారేసుకుంటే అది వారికే చేటు తెచ్చేలా ఉంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చిన తరువాత అమలవుతున్న పాత, కొత్త సంక్షేమ పథకాలలో ప్రజల మన్ననలు పొందిన జాబితాలో నెంబర్ వన్ ప్లేస్లో నిలుస్తున్నది ఫ్రీ బస్సు పథకం.
ఇది పేద, మధ్య తరగతి బడ్జెట్కు ఆసరాగా నిలుస్తున్నది. బస్సులు తక్కువున్నాయి.. మనకు మనకే పంచాది పెడుతున్నరు..ఇలా ఏదో ఒక కారణం, సాకులు చెబుతూ దీన్ని కేవలం రాజకీయ విమర్శ కోసం వాడుకుందామని అనుకున్నా.. అది వారికే డేంజర్. మొన్నటి దాకా కేటీఆర్ దీనిపై కామెంట్ చేశాడు. తాజాగా కవిత కూడా నిజామాబాద్ సభలో ఫ్రీబస్సు పథకం పెట్టి పంచాది పెట్టింది సర్కార్ అని విమర్శించే ప్రయత్నం చేశారు.
ఇంకే పథకంపైన మాట్లాడినా ఓకే.. కానీ అన్నింటితో పాటు దీన్ని కలగలిపి తిట్టిపెడతామంటే మాత్రం దానికి పెద్దగా స్పందన రాదు.. పట్టంచుకోరు. పైగా పదే పదే ఈ బస్సు పథకాన్ని విమర్శించే పని పెట్టుకుంటే వారి పనే ఖతమవుతుంది. అంతలా పెనవేసుకు పోయిందీ పథకం. ఇప్పుడిదంతా డిస్కషన్ ఎందుకంటే.. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని చెప్పుకున్న మంత్రి.. ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వివరించారు. రూ. 12,167 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారని వివరించారు. దీన్ని ఆదా అనేకంటే ప్రభుత్వం మహిళలకు అందించిన ఆదాయం కిందనే చూడాలి. ఆ కుటుంబ బడ్జెట్ భారం తీర్చిందని కూడా చెప్పుకోవాలి.
ఆసరా పింఛన్లు నేరుగా నగదు రూపంలో పేద లబ్దిదారులకు ఆర్థిక భరోసా ఇస్తుంటే.. ఫ్రీ బస్సు పథకం చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. ప్రయాణానికి ఆటంకం లేకుండా ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లేందుకు మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంది. దీనిపై మెరుగైన సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేయాలే తప్ప.. ఇదో వేస్ట్ పథకంగా విమర్శించే దోరణి మానుకోకపోతే.. పొలిటికల్ మైలేజేమో గానీ డ్యామేజీ కావడం ఖాయం.
గతంలో ఆర్టీసీ ఆక్యూపెన్సీ 67శాతంగా ఉంటే ఇప్పుడు 89 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. పనిలేకున్నా.. ఇంట్లో గొడవలు జరిగినా.. భర్తపై అలిగినా .. మహిళలు బస్సెక్కి వెళ్లిపోతున్నారనే చీప్ కామెంట్స్ కూడా కొందరు చేశారు. కేటీఆర్ కూడా ఏం తక్కువ తినలేదు. బస్సులెక్కి డిస్కో డ్యాన్సులు చేయండి.. అని మాట తూలాడు. ఆ తరువాత నాలుక కరుచుకున్నాడు.
2932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, 1024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయన్న మంత్రి.. హైదరాబాద్ నగరంలో మరో 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయని ఖుషీ కబర్ చెప్పారు మహిళా లోకానికి.