Cabinet Reshuffle: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణ తో పాటు సమూల ప్రక్షాళన జరగబోతోందనే వార్తలు రాష్ట్ర రాజకీయాన్ని తీవ్రంగా ఊపేస్తున్నాయి. పలువురు మంత్రులపై వరుసగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు, అధిష్ఠానానికి అందిన రహస్య నివేదికలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఏఐసీసీ ఇచ్చే తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా కొందరు మంత్రుల తీరుపై పార్టీ వర్గాల్లోనూ, ప్రజా క్షేత్రంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుండి తప్పించడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు కొన్ని కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులపై స్వపక్షం నుంచే ఫిర్యాదులు వెళ్లడం, అవినీతి , నిర్లక్ష్య ఆరోపణలు రావడంతో ఏఐసీసీ వీరి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.కొందరు మంత్రులు కేవలం తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా మంత్రులను తప్పిస్తారా? లేక కంటిన్యూ చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.
ప్రభుత్వం లో ఏర్పడిన ఇంటర్నల్ వార్స్ నేపథ్యంలో ఫర్మా మెన్స్ ఫార్ములాను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే బృందం అమలు చేయాలని భావిస్తోంది.వివాదాల్లో ఉన్న మంత్రులపై వేటు వేయడం, వారికున్న ప్రాధాన్యత కలిగిన శాఖలను తొలగించి సాధారణ శాఖలకు పరిమితం చేయడమో జరుగుతుందని సమాచారం.ఇక జనరేషన్-జీ లకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలిసింది. పనితీరు సరిగ్గా లేని సీనియర్లను పక్కనపెట్టి యువ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించే దిశగా ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ తొలగింపులతో వచ్చే ఖాళీలను భర్తీ చేసే క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ , మహిళా కోటాలు దెబ్బతినకుండా ఉండేలా హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటుంది.
Also read: పెట్రోల్తో పాటు ఇథనాల్ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!
రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు దూకుడు పెంచుతున్న వేళ, కేబినెట్ ప్రక్షాళన ద్వారా కాంగ్రెస్ సర్కార్ పునర్వైభవం సాధించాలని చూస్తోంది.ఆశావహులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టి అధిష్ఠాన పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక కొందరు యువ ఎమ్మెల్యేలు సైతం సీనియర్ మంత్రులను కాకా పడుతున్నారు. తమకు కేబినెట్ లో స్థానం కల్పించే దిశగా మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. కేవలం కేబినెట్ విస్తరణ మాత్రమే కాకుండా, పీసీసీ సమన్వయంతో కూడిన ‘సమూల మార్పులు’ జరగనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే ఏఐసీసీ నిర్ణయం కోసం గాంధీభవన్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also read: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!