Akshaya Tritiya: వైశాఖ శుద్ధ తదియ.. మనం ప్రత్యేకంగా అక్షయ తృతీయగా జరుపుకునేది ఈరోజే. హిందూవులు, జైనులకు ఈ రోజు చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే మనం కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటాం. ముఖ్యంగా అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూడాల్సిన అవసరం లేదు అనేది నమ్మకం. ఎందుకంటే అక్షయ తృతియ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే.
మాములుగా మనం అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడం మాత్రమే అనుకుంటాం. కానీ అది ఒక్కటే అక్షయ తృతీయ ప్రత్యేకత కాదు. అనేక కారణాల్లో అది ఒకటి మాత్రమే. అసలు ముందుగా ఈ రోజున బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసుకుందాం. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని, సంపద నిరంతరం పెరుగుతుందని ప్రజల నమ్మకం. బంగారం అనే కాదు.. ఈ పవిత్రమైన రోజున వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని, ఇంట్లో శుభం కలుగుతుందని కోట్లాది మంది నమ్ముతారు.
నిజానికి చాలా మంది ఆ రోజు బంగారం ఎందుకు కొనాలో తెలీకపోయినా, పక్కింటి వాళ్లు కొంటున్నారనో, ఎదురింటి వాళ్లు వెళ్తున్నారనో.. వాళ్లతో కలిసి జ్యూయెలరీ షాపుకు వెళ్లి బంగారం కొనేస్తారు. చాలా ఏళ్ల నుంచీ ప్రకటనల జోరు పెరుగుతుండగా అక్షయ తృతీయ సెంటిమెంట్, ఆ రోజున బంగారం కొనేవాళ్ల సంఖ్య కూడా అంతే పెరుగుతూ వస్తోంది. కానీ శివుడు మహాలక్ష్మీ వ్రతాన్ని విశేషంగా చెప్తూ ప్రార్థించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఆ రోజున బంగారం కొంటే శుభం జరుగుతుంది అని చాలా మంది బంగారం కొంటుంటారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు. అందుకే ఈ రోజు అమ్మవారిని అలంకరిస్తారు. అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరించాలనే సెంటిమెంట్ మొదలైంది. కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి కానీ…. బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు..దాన, ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది.
సరే బంగారం విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. అక్షయ తృతీయకు ఇంకా చాలా విశేషాలున్నాయి. కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణం చెబుతోంది. నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకరైన పరశురాముడు.. వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అంటే ఆ దేవదేవుడే నరుడిగా జన్మించిన రోజు అని నమ్ముతారు.
పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే అంటారు. వ్యాస మహర్షి మహా భారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ.. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే. కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజే. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకధారాస్త్రోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం అక్షయ తృతీయ రోజునే.
ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే.. ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయనే.
ఇక మత్స్యపురాణం, నారద పురాణాలను పరిశీలిస్తే.. ఈ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తున్నాయి. ఈ రోజున అర్హులైనవారికి వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యం, ఇతర సామాగ్రిని దానం ఇవ్వాలని చెబుతోంది. అలాగే వస్త్రదానం, నీటితో ఉన్న కుండను దానం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం. అదీఇదీ అని కాదు… ఈ రోజు మన స్తోమతను బట్టి, ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే అంటారు పండితులు. అక్షయ తృతీయ పితృదేవతలను ఆరాధించుకునే రోజు కూడా. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా… ఈ రోజు వారిని స్మరించుకోవడం వల్ల వారిని శాంతింపచేసుకోవచ్చు.
ఇక జైనులు కూడా ఈ పండగను జరుపుకుంటారు. కానీ పూర్తి భిన్నంగా ఉంటాయి ఈ వేడుకలు. జైనమతంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకునే సంప్రదాయం, ప్రాముఖ్యత పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జైనమతంలో ఇది శ్రమనా సంస్కృతితో యుగానికి నాందిగా పరిగణిస్తారు. జైనమతం ప్రకారం భారత ప్రాంతంలో యుగం మార్పు భోగభూమి, కర్మభూమి రూపంలో జరిగింది. జైనమతంలో అక్షయ తృతీయను దాతృత్వానికి, పుణ్యం సంపాదించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల పంట చెడిపోదని నమ్ముతారు.
జైన మతం నమ్మకం ప్రకారం మొదటి తీర్థంకరుడు ఒక ఏడాది పాటు తపస్సు చేసిన తర్వాత వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు అంటే అక్షయ తృతీయ రోజున చెరకు రసంతో తపస్సు పూర్తి చేశాడు. ఈ కారణంగా జైన సమాజంలో ఈ రోజు ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ నమ్మకం కారణంగానే జైనులు నేటికీ అక్షయ తృతీయ వ్రతం చెరుకు రసంతో విరమిస్తారు. జైనులు కూడా విరాళానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే అక్షయ తృతీయ రోజున ప్రజలు అన్నదానం చేస్తారు. జ్ఞానదానం చేస్తారు, ఔషధాలను దానం చేస్తారు లేదా దేవాలయాలలో దానం చేస్తారు.
ఇలా హిందూవులు.. జైనులు.. అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటారు. విధానాలు వేరైనా.. పద్ధతులు విభిన్నంగా ఉన్నా.. అంతిమంగా మాత్రం దానా ధర్మాలు మాత్రం రెండు సాంప్రదాయాల్లో మాత్రం కామన్. సో.. ఇప్పుడైనా అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం మాత్రమే కాదని తెలుసుకోండి.
Also Read: బీజేపీ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.. మోదీ తీరుపై కాంగ్రెస్ ఎంపీ చామల తీవ్ర ధ్వజం