Jagan Padayatra: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ గానీ, అక్టోబర్లో గానీ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలో పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో.. తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ యాత్ర ఇప్పుడు ఒక తేదీకి దగ్గరైంది. ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యాత్ర సాగనుందని చెప్పారు. 2029లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు.. జగన్ పాదయాత్ర రాజకీయంగా కీలకంగా మారింది. 2017లో ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పార్టీకి పెద్ద ఊపు తెచ్చింది. 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లకు పైగా ఆయన నడిచారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు.
Also read: ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!
రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులతో మమేకమయ్యారు. అలా జగన్ పాదయాత్ర వైసీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకొని వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. పాదయాత్రకు మరో ఏడాది సమయముంది. కానీ కార్యకర్తలను ఇప్పుడే అలర్ట్ చేశారు జగన్. జగన్ పాదయాత్ర 2.0 మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తుందో లేదో చూడాలి.
Also read: ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్మెంట్!