Dalit Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సామాజిక వర్గాల చుట్టూ రాజకీయం వేడెక్కింది.‘దళిత్ వర్సెస్ దొరలు’ అనే పాత, పదునైన ఎజెండాను కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెరపైకి తెచ్చింది. తమది పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల వైపు నిలబడే పార్టీ అని చాటుకుంటూనే.. ప్రత్యర్థి బీఆర్ఎస్ను “అగ్రవర్ణాల, దొరల పార్టీ”గా ప్రజల మదిలో ముద్ర వేసేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలి.. కాంగ్రెస్ పార్టీకి ఈ అంశంలో మరింత కలిసివచ్చాయనే చర్చ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల శాసనమండలి ప్రాంగణంలో, వెలుపల జరిగిన వరుస సంఘటనలను కాంగ్రెస్ పార్టీ అత్యంత చాకచక్యంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయింది.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (దళిత సామాజిక వర్గం) పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత నేతను అవమానించడమంటే మొత్తం దళిత సమాజాన్ని అవమానించడమేనంటూ కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి అసెంబ్లీలో ఇదే అంశంపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ ల మధ్య వాగ్వాదం నెలకొన్నది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపడం, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం పెద్ద దుమారానికే దారితీసింది. “పేదలు, దళితులు అడుగుపెడితే మైలపడిపోయిందనే అహంకార ధోరణికి ఈ పసుపు నీళ్ల శుద్ధే ప్రత్యక్ష నిదర్శనం” అని కాంగ్రెస్ ఎండగడుతోంది.
Also read: బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటి నుంచే బీఆర్ ఎస్ ను దొరల పార్టీ అని, కేసీఆర్ కు తీవ్రమైన అహంకారం ఉంటుందని ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేలా ప్రచారం చేసింది. తాజాగా జరిగిన పొలిటికల్ ఎపిసోడ్ లను బట్టి మళ్లీ దళితులు, దొరలు అనే సామాజిక వర్గాల చుట్టూ పాలిటిక్స్ ను తెరమీదకు తీసుకువచ్చింది. సామాన్యులంతా కాంగ్రెస్ వైపు నిలబడాలని, బీఆర్ఎస్ కేవలం ఒకే కుటుంబం, అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని, దళితులు-బహుజనులకు అక్కడ గౌరవం ఉండదనే భావనను బలంగా నాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తమది సామాన్యుల ప్రభుత్వమని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని చాటుకోవడానికి ఈ పరిణామాలను కాంగ్రెస్ పూర్తిస్థాయిలో వాడుకుంటోంది.అయితే కాంగ్రెస్ పరోక్షంగా వదిలిన ఎజెండా వలన ఏ పార్టీకి ఏ స్థాయిలో మైలేజ్ తెచ్చిందనేది త్వరలో తెలిపోనున్నది.
బీఆర్ఎస్ నాయకులు ఉద్వేగంలోనో, ఆవేశంలోనో చేస్తున్న కొన్ని తప్పులు కాంగ్రెస్కు రాజకీయ మైలేజ్ను ఉచితంగా కట్టబెడుతున్నాయి. బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, “దళిత వ్యతిరేక” ముద్రను తిప్పికొట్టడంలో ఆ పార్టీ శ్రేణులు కొంత తడబడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.వాస్తవానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ, ఆ తర్వాత రాజకీయాల్లోనూ “దొరతనం వర్సెస్ ప్రజలు” అనే భావజాలం చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అదే అంశాన్ని రీ-లంచ్ చేసింది. పొలిటికల్ స్ట్రాటజీలో తెరమీదకు వచ్చిన ఈ అంశం ప్రభావం లీడర్ల భవితత్వంపై ఏ మేరకు చూపుతుందనేది త్వరలోనే తెలియనున్నది.
Also read: బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!