AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కీలకమైన ఈ సెషన్స్ నుంచి వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు హాజరై ఎప్పటిలాగే కొద్ది నిముషాల్లోనే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ సభ్యులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి అరుచుకుంటూ బయటకు వెళ్లిపోయారు. సభలోకి వస్తూనే నినాదాలు చేసుకుంటూ వచ్చిన జగన్ టీమ్ గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆయన చెయిర్పై పేపర్లు విసిరి గలాభా సృష్టించారు. దాంతో రాబోయే రోజుల్లో వారు సభకు హాజరవుతారా? వచ్చినా సమావేశాలను సజావుగా సాగనిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ఆరంభమైన కాసేపటికే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా 11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తిరుమల లడ్డూ గోవిందా, గోవిందా అంటూ లాబీల్లో నినాదాలు చేశారు. ఎప్పటిలాగే జై జగన్ అంటూ తమ స్వామిభక్తి చాటుకున్నారు. సరిగ్గా 10 గంటలకు అసెంబ్లీలోకి వైసీపీ సభ్యులు వెళ్లి.. కేవలం 11 నిమిషాల పాటు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి , సభాపతి చెయిర్పై పేపర్లు విసిరి బయటకు వచ్చేశారు. సభ ప్రారంభమైన కేవలం 11 నిమిషాల్లోనే జగన్తో పాటు వైసీపీ సభ్యులు 11 మంది సభను వీడటం చర్చనీయాంశమైంది. వారితో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా వాకౌట్ చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో వాకౌట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. సభలోప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ విమర్శించింది. అలాగే ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు అడగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సభలో తమ స్వరాన్ని వినిపించుకునే అవకాశం లేకపోవడంతో వాకౌట్ చేయడం తప్ప మరో మార్గం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: AP ECET 2026: ఏపీ ఈసెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 23న పరీక్ష, దరఖాస్తుకు చివరి తేది..?
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ సభ్యులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ చాంబర్ నుంచి సభకు వచ్చిన మాజీ సీఎం జగన్ పార్టీ సభ్యులతో కలిసి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ఉన్న 11 నిముషాలు గలాభా సృష్టించి వెళ్లిపోవడం విమర్శలపాలు అవుతోంది గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర విభజన సమస్యలతో పాటు ఆర్థిక కష్టనష్టాల మధ్య ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, 22ఏ వంటి నిబంధనలు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. విద్యుత్, సాగునీరు, రహదారులు వంటి కీలక మౌలిక వసతుల రంగాల్లో ప్రగతి కుంటుపడిందని వివరించారు.
2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని గవర్నర్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సాగుతోందని చెప్పారు. గత 19 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టి, సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలను పునఃప్రారంభించినట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత కోసం ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసి, వ్యవస్థల పునరుద్ధరణపై తొలి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రశంసించారు. గవర్నర్ ప్రసంగం ఆరంభంలోనే వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత జరిగిన బీఏసీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. అత్యంత కీలకమైన రాష్ట్ర బడ్జెట్ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా చట్టసభలో బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. గతంలో తీసుకువచ్చిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకువస్తుంది. పరిపాలనలో సంస్కరణలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు కీలకం కానున్నాయి.ఇంత కీలకమైన సమావేశాల్లోనూ వైసీపీ పాత పంధానే అవలంభిస్తుండటంతో … రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ప్రతిపక్షం సభకు హాజరవ్వాలని నిర్ణయిస్తే మరిన్ని నిరసనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుల వైఖరిపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్కు వీడ్కోలు పలికి తిరిగి వచ్చే సమయంలో మీడియా ప్రతినిధులతో సభాపతి మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు 11వ తేదీన.. 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి.. 11 నిమిషాలు మాత్రమే ఉండి సభ నుంచి వెళ్లిపోయారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరంటూ… ‘11’ని వత్తిపులుకుతూ చమత్కరించారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
Also Read:YS Jagan on Sai Reddy: సాయిరెడ్డి రాజీనామాపై జగన్ కామెంట్స్.. క్యారెక్టర్ అంటూ..
Story By :APPARAO, BIG TV