Magunta Srinivasulu: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి … ఒంగోలు నుంచి కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి మొత్తం అయిదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయనకు వివాదరహితుడన్న పేరుంది. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట ఏది చేసినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. తాను వచ్చే సారి ఎన్నికల్లో పోటీ చేయనని సదరు ఎంపీ ఇప్పటికే ప్రకటించినా పొలిటికల్ సౌండ్స్ మాత్రం ఆగటం లేదట.. ఆయన ఎక్కడకు వెళ్లినా.. ఎవరిని కలిసినా ఏదో జరుగుతుందబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టేస్తున్నారు. తాజాగా ఆయన ఒక వివాహంలో వైసీపీ అధ్యక్షుడు జగన్తో ముచ్చటించడం హాట్ టాపిక్గా మారింది.
హుందాగా రాజకీయాలు చేసే ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వలేదని పొలిటికల్ సర్కిల్స్లో నడిచే టాక్.. ఆయన తన పొలిటికల్ కెరీర్లో మూడు సార్లు కాంగ్రెస్ నుంచి, వైసీపీ నుంచి ఒకసారి ఒంగోలు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అయిదో సారి పార్లమెంట్ సభ్యుడయ్యారు. ఇంత సుదీర్ఘ నేపధ్యం ఉన్నా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించి లేదు.. అయితే గత కొద్దికాలంగా.. అంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఏం మాట్లాడినా.. ఎవరిని కలిసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ లా మారుతోంది..
తాజాగా చెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు ఎంపీ మాగుంట హాజరయ్యారు, అక్కడే జగన్ కలవడంతో ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం…ఆ వీడియో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న శ్రీనివాసులురెడ్డిపై ఢిల్లీ లిక్కర్ స్కాం అభియోగాలు వచ్చాయి. ఆ కేసుకు సంబంధించి ఆయన కొడుకు జైలుకు వెళ్లి రావడం మాగుంట పొలిటికల్ కెరీర్లో ఒక బ్లాక్ మర్క్గా మిగిలింది. ఆ తర్వాత పరిణామాలతో జగన్ ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ నిరాకరించడంతో మాగుంట టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని ఆయన శతవిధాలా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ, ఇటీవలే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని, తన కుమారుడే ఇక రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారని మాగుంట ప్రకటించారు.
ఇదంతా ఒకెత్తైతే.. తాజాగా చెన్నైలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్ను మాగుంట ఆప్యాయంగా పలుకరించటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపుతుంది. పాత పరిచయం ఉన్న ఇద్దరు…. ఒక కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం మామూలేగానీ…. ఈ పలకరింపుల్లో అంతర్యం ఏంటనే చర్చ జరుగుతుందట. ఇది పలకరింపులకే పరిమితమా? లేక అంతకు మించి ఏమైనా చర్చలు జరిగాయా? అనేది పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద డిబేట్గా మారిపోయింది.
మొత్తానికి మాగుంట చెన్నైలో మాజీ సీఎం జగన్ కజిన్ బ్రదర్ వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరవ్వడం.. అదే కార్యక్రమానికి హాజరైన జగన్ను కలవటం.. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకోవటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 1998లో రాజకీయ ఆరంగ్రేటం చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన పెద్దగా వివాదాల జోలికి వెళ్లింది లేదు.. ఒక్క డిల్లీ లిక్కర్ కేసు మినహా ఆయనపై ఆరోపణలు కూడా లేవు.. గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2019 ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట 2.14 లక్షల భారీ మెజారిటీతో గెలిచారు..
అయితే మొదట్లో అంతా బాగానే ఉన్న తెలంగాణా సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికైన సమయంలో మాగుంట వెళ్లి ఆయన అభినందనలు చెప్పి రావటం వైసీపీ వర్గాలకు ఆగ్రహం తెప్పించిందన్న టాక్ నడిచింది.. తదనంతర పరిణామాల నేపధ్యంలో జగన్ ఆయనకు టికెట్ నిరాకరించటం.. ఆయన 2024 ఎన్నికలకు ముందు టీడీపీ లోకి వెళ్లి పోటీ చేసి గెలవటం జరిగిపోయాయి.. అయితే ఆయనకు జగన్ తో గ్యాప్ రావటానికి లిక్కర్ కేసు టైమ్లో జగన్ డిమాండ్లను మాగుంట అంగీకరించక పోవడమే కారణమన్న టాక్ కూడా నడిచింది. అదే సమయంలో పార్టీకి సమాచారం ఇవ్వకుండా తెలంగాణా సీఎం రేవంత్ ను వెళ్లి కలవటంతో .. వైసీపీ శ్రేణులు దాన్నే గ్యాప్కు ప్రధాన కారణంగా ఫోకస్ చేశాయంటారు.
ప్రస్తుతం వివాహ వేడుకలో జగన్ను ఆయన యాధృచ్చికంగా కలసి మాట్లాడినా.. ఎవరికి వచ్చింది వాళ్లు రాసేసుకుంటున్నారు.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేకపోయినా.. తిరిగి జగన్ తో టచ్ లోకి వస్తున్నారని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి వైసీపీ లోకి వెళ్తారని సోషల్ మీడియా ప్రచారం మొదలైంది. ఆ క్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న సమ్ ధింగ్.. సమ్ ధింగ్ ప్రచారంపై మాగుంట సన్నిహితులు మాత్రం ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేస్తున్నారు.. ఆయన కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొస్తున్నారు. మాగుంట అందరితో బాగా ఉండే వ్యక్తి కావటంతో వివాహ వేడుకకు హాజరైన జగన్ ను కలిశారే తప్ప రాజకీయాలకు తావులేదని క్లారిటీ ఇస్తున్నారు.
అయితే జగన్ తో మాగుంట పలకరింపును టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుంది.. …టర్నింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా?లేకపోతే మాగుంట సాధు స్వభావం తెలుసుకాబట్టి టీడీపీ పెద్దలు లైట్ తీసుకుంటారా? అన్న ఆంశాలు ఆసక్తి రేపుతున్నాయి. మరి సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చపై మాగుంట స్టైల్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది చూడాలి.
Also Read: శింగనమల టీడీపీలో ‘చేతబడి’ రాజకీయం.. ప్రత్యర్థుల స్కెచ్కి ఎమ్మెల్యే బ్రేక్ వేస్తారా?
Story by: Apparao, Big Tv