ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ప్రతిష్టాత్మకమైన ఏపీ ఈసెట్ (AP ECET) – 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతను అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU-A) కి అప్పగించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ (BE), బీటెక్ (B.Tech), బీఫార్మసీ (B.Pharmacy) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ సెట్ ఒక చక్కని అవకాశం.
దరఖాస్తు వివరాలు..
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 4, 2026 నుండి ప్రారంభం కానుంది. ఎటువంటి అదనపు రుసుము లేకుండా మార్చి 2, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకవేళ గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి ప్రభుత్వం వివిధ దశల్లో ఆలస్య రుసుముతో అవకాశం కల్పించింది.
ఆలస్య రుసుముతో….
రూ. 1,000 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు,
రూ. 2,000 ఆలస్య రుసుముతో మార్చి 10 వరకు,
రూ. 4,000 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు,
గరిష్టంగా రూ. 10,000 ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి మార్చి 20న కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు..
ఏపీ ఈసెట్ పరీక్షను ఏప్రిల్ 23, 2026న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్టికెట్లను ఏప్రిల్ 9 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ముగిసిన అనంతరం ఏప్రిల్ 27న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 29 వరకు సమర్పించవచ్చు. తుది ఫలితాలను మే 7, 2026న ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ద్వారా వారి ర్యాంకుల ఆధారంగా కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.