Bandi Sanjay: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల హడవుడి మొదలైయ్యింది. సింబల్ లేనప్పటికీ తమ మద్దతుదారులని గెలిపించుకుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్.. తన పార్లమెంటు పరిధిలో బీజేపీ నేతలని గెలిపించుకునేందుకు పక్కా ఫ్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ గ్రామాల్లో కమలం వికసించేందుకు ఆయన రచిస్తున్న వ్యూహాలేంటి? అవి ఏమాత్రం ఫలితం చూపించబోతున్నాయి?
సై అంటే సై అంటున్న మూడు ప్రధాన పార్టీలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఈ జిల్లా స్పెషాలిటీ ఏంటంటే.. ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్తో పాటు.. విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా సై అంటే సై అనుకునేలా ఉంటాయి ఎప్పుడూ. అందుకే పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకొని సత్తా చాటాలని ఇప్పటికే గ్రౌండ్లోకి దిగాయి కూడా. ముఖ్యంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పట్టు సాధించడంపై నేతలు దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఓ అడుగు ముందు ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలోనే బీజేపీ మద్దతుదారులు గెలిపించడమో.. ఏకగ్రీవం చేయడమో చేస్తే ఎంపీ కొటా ద్వారా 10 లక్షల నిధులు ఇస్తామని హామి ఇచ్చారు బండి సంజయ్. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహిస్తున్న బండి సంజయ్
హుజురాబాద్లో గ్రామపంచాయతీ ఎన్నికల కొసమే బూత్ లెవల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కరీంనగర్ పార్లమెంటు పరిధిలొని బూత్ లెవల్ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే పంచాయతీల అభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్. తమ మద్దతుదారులని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు. స్థానిక సంస్థలలో ఎక్కువమంది విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం ఉంటుందనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి గ్రామపంచాయతీ ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకున్నారు బండిసంజయ్.
రెండు సార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా బండి సంజయ్
రెండు సార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు బండిసంజయ్. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో గతంలో కంటే బీజేపీ క్యాడర్ ఇప్పుడు పెరిగింది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా బీజేపీకి చెందిన వారు ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గట్టి పోటి ఇవ్వొచ్చని బండిసంజయ్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలవాలని కార్యకర్తలకి సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆ పథకాల కారణంగా పంచాయతీలకు వచ్చే నిధుల విషయాన్ని గ్రామాలలో ఇంటింటికి తీసుకువెళ్ళాలని సూచిస్తున్నారు.
Also Read: కర్నూల్లో కుర్చీ కోసం సై అంటే సై అంటున్నా.. అఖిలప్రియా Vs ఎస్వీ జగన్మోహన్ రెడ్డి
నిజానికి బండి సంజయ్ మాత్రమే కాదు.. బీజేపీ హైకమాండ్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెజారిటీ పంచాయతీలు తమ ఖాతాలో వేసుకోవాలనేది బీజేపీ నేతల లక్ష్యం. ముఖ్యంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లోని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఆ ప్రాంతాల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యతలను హైకమాండ్ ప్రజాప్రతినిధులకే అప్పగించింది. అందుకే బండి సంజయ్ ఈ ఎన్నికలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ కేవలం ఎంపీ మాత్రమే కాదు.. కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓడడం అనేది పరువు పోయే పరిస్థితి. అందుకే ఈ ఎన్నికలను బండి సంజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
Story By Vamshi Krishna, Bigtv