BJP Vs MIM: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్కు ఇంకా సమయం వుంది. ఏప్రిల్ 23 న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇంకా పోలింగే జరగక పోయినా, ఫలితంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలిసి పోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం బరిలో ఉన్న పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఎంఐఎం అభ్యర్ధిగెలుపుకు ఢోకా లేదు. అయితే, ఫలితం ముందుగానే తెలిపోయినాఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది? అంటే, అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 113 మంది ఓటర్లు
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే ,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందు గానే ఖారారై పోయింది.
పోటీకి దూరమైన 24 ఓట్లున్న బీఆర్ఎస్
ఎంఐఎంకు కాంగ్రెస్ లోపాయికారీ మద్దతు ఉండటంతో ఎలెక్టోరల్ కాలేజీలో 24 ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే మొదట్లో కాంగ్రెస్, ఎంఐఎంల లోపాయికారీ ఒప్పందంపై విమర్శలు గుప్పిస్తూ పోటీకి దూరంగా ఉంటానన్న బీజేపీ చివర్లో అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. కాషాయపార్టీకి కార్పొరేషన్లో 25 ఓట్ల బలం మాత్రమే ఉంది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారుగోముల గౌతంరావును బీజేపీ బరిలో దింపింది.
ఎంఐఎం ఏకగ్రీవాన్ని అడ్డుకునేందుకే బీజేపీ పోటీ
దాంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే, ఏదో అద్భుతం జరిగితే తప్పించి, ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి గెలుపును ఆపడం, మోడీ, షా దిగి వచ్చినా అయ్యేపని కాదని అంటున్నారు. ఆ విషయం బీజేపీ నేతలకు తెలియంది ఏమీ కాదు. అయితే ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డు కునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెపుతున్నారు. కేవలం ఎంఐఎం ఏకాగ్రీవాన్ని నిరోధించడం మాత్రమే కాదు, గెలిచేందుకే పోటీ చేస్తున్నామని బీజీపే నాయకులు చెప్పుకుంటున్నారు. తమ విజయానికి అవసరమైన లెక్కలు తమకున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న కాషాయ పార్టీ
కాషాయ పార్టీ క్రాస్ ఓటింగ్ పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఎంఐఎం అభ్యర్ధికే ఉంటుందంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. తమకు బలం లేదు, అందుకే పోటీచేయడం లేదు అంటున్నారే, కానీ, తమ మద్దతు ఎవరికో చెప్పడం లేదు. అసలు ఓటింగ్లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు.
హిందుత్వ కార్డును తెరపైకి తెస్తున్న బీజేపీ
ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎప్పటిలాగే హిందూ కార్డును తెర పైకి తెస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అటో ఇటో తేల్చుకోవాలని కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇవి దేశభక్తలు, దేశద్రోహ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ యుద్దంలో దేశభక్తులను గెలిపించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురికావద్దని పరోక్షంగా హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతంగా ఎంఐఎంను ఓడించాలంటున్న బీజేపీ
ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మల్యే రాజా సింగ్ అధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా లక్ష మందికి పైగా హిందువులు ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసిన బండి సంజయ్, బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను గుర్తెరగలన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం ఓడించేందుకు , బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు.
Also Read: కొడుకు కోసం కాపు తిప్పలు.. ప్రయత్నాలు ఫలిస్తాయా..!
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటింగ్లో పాల్గొంటాయా?
అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఆసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా? లేదా? అనేదే స్పష్టం కాని తరుణంలో క్రాస్ ఓటింగ్పై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు
అదలా ఉంటే ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా వుంది. అంతే కాకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ, సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నఆరోపణలకు, ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర పోటీ సమాధానం అవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే బీజేపీ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరోధించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు, హిందూ ఓటు బ్యాంకును పటిష్ట పరచుకునేందుకు, ఇదొక అవకాశంగా బావిస్తున్నట్లు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ గెలుపోటమలు ప్రసక్తి ఎలా ఉన్నా హైదరాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్యే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయిప్పుడు..