Anantapur Politics: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. సరిగ్గా కాపు రామచంద్రారెడ్డి విషయంలో అదే జరుగుతోందా? వైసీపీలో టికెట్ దక్కే పరిస్థితి లేదని ఎన్నికల ముందు బయటకు వచ్చిన ఆయన తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నారా? వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి తమ దూతలను పంపిస్తున్నారా? జగన్కు తిరిగి దగ్గరవ్వడానికి కాపు రామచంద్రారెడ్డి చేస్తున్న ప్రయత్నాలేంటి? మాజీ ముఖ్యమంత్రి ఆయన చేరికపై ఏమంటున్నారు?
వైసీపీలో రీఎంట్రీ ఇవ్వడానికి కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నాలు
వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీ క్యాడర్ ఢీలా పడిపోయింది. కీలక నేతలు పలువురు తమ దారి తాము చూసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పార్టీ నుంచి వెళ్లే వారు తప్పిస్తే..పార్టీలోకి వచ్చే నేతలెవరూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు వైసీపీకి గుడ్బై చెప్పిన సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి పార్టీలోకి రీ ఎంట్రి ఇవ్వడానికిపావులు కదుపుతున్నారంట. గత సార్వత్రిక ఎన్నికల ముందు టికెట్ దక్కదన్న అక్కసుతో ఆయన తాడేపల్లిలో జగన్ ప్యాలెస్కు ఒక దణ్ణం పెట్టి వైసీపీని వీడి బీజేపీలో చేరారు.
రాయదుర్గం నుంచి 3 సార్లు గెలిచిన రామచంద్రారెడ్డి
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు , తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దాంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి ఏమాత్రం మెరుగు పడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి వైసీపీ తరుఫున రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు అక్కడ నుంచి విజయం సాధించారు.
కాల్వ శ్రీనివాసులపై పోరాటానికి వైసీపీలో చేరాలని చూస్తున్న కాపు
ఓడిపోయిన తర్వాత మెట్టు గోవింద రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు . బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అసలు కనిపించడమే మానేశారు. దాంతో వైసపీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సరిగ్గా ఇదే అంశం కాపు రామచంద్రారెడ్డికి కలిసి వచ్చింది. బిజెపిలో ఉన్నా సరే కాల్వ శ్రీనివాసులును కాపు రామచంద్రారెడ్డి ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారంట. ఆ క్రమంలో కాల్వ పై పోరాటానికి వైసీపీనే సరైన వేదిక అనుకుని తిరిగి పార్టీలో చేరాలని చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరాలని చూస్తున్నారంట. జగన్తో తనకున్న సాన్నిహిత్యంతో ఆయన ప్రయత్నాలు ప్రారంభించారంట.
లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డి
రాయబారంగా కొంతమంది దూతలను కూడా జగన్ వద్దకు పంపించారంట కాపు రామచంద్రారెడ్డి. కాపు రామచంద్రారెడ్డి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో తన సామాజిక వర్గంలోని 12 మంది స్వామీజీలను జగన్ వద్దకు పంపించి రాయబారం నడిపారట. ఎలాగైనా కాపుని తిరిగి వైసిపి పార్టీలో చేర్చుకోవాలని జగన్ మీద ఒత్తిడి తెచ్చారట. తమ సామాజిక వర్గంలో ఉన్న ఏకైక బలమైన నాయకుడు ఆయనేనని జగన్ దగ్గర స్వామీజీలు చెప్పారట. ఎలాగైనా సరే వైసీపీలో చేర్చుకొని రాయదుర్గం ఇన్చార్జ్ బాధ్యతలను ఇచ్చేలా ఒప్పించే బాధ్యతలను ఆ స్వామీజీలకు అప్పచెప్పారట కాపు.
కాపుని తాము పంపించలేదని స్వామీజీలకు చెప్పిన జగన్
కాపు రామచంద్రారెడ్డిని తాము పొమ్మనలేదని.. ఆయనే సెల్యూట్ కొట్టి మరీ పోయారని జగన్ స్వామీజీల దగ్గర చెప్పారట. మరోవైపు జగన్కి ఎంతో సన్నిహితంగా ఉండే మైనింగ్ కింగ్ గాలి జనార్దన్రెడ్డితో సైతం కాపు లాబీయింగ్ చేయించుకునే పనిలో పడ్డారంట. గాలి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే కాపు రామచంద్ర రెడ్డి అటెండ్ అవుతనారట.
గాలికి దగ్గరవుతూ జగన్ దృష్టిలో పడటానికి ప్రయత్నాలు
మధ్యలో గాలి జనార్ధనరెడ్డితో విభేదాలతో దూరం అయిన కాపు మళ్లీ ఆయనకు దగ్గరవుతూ జగన్ దృష్టిలో పడాలని చూస్తున్నారట. ఇన్ని పాట్లు ఎందుకు పడుతున్నారా? అని ఆరా తీస్తే తనతో పాటు తన కొడుకు కాపు ప్రవీణ్ రెడ్డి భవిష్యత్తు కోసమే అని తెలుస్తోంది. చిన్నగా వైసీపీ లోకి తను చేరి ఆ తర్వాత తన కొడుకు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని ఇన్ని తిప్పలు పడుతున్నారట.
Also Read: రాజ్ భవన్కు సుప్రీం ఆర్డర్.. ఆ గవర్నర్ చేసిన తప్పు ఇదేనా..! స్టాలిన్ ఏం చేశాడంటే..?
జగన్ ఇంటికి దగ్గర సెల్యూట్ చేసి హంగామా సృష్టించిన కాపు
అయితే కాపు రామచంద్ర రెడ్డి వైసీపీని వీడే సమయంలో చేసిన హంగామా ఆయనకు మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వైసిపికి గుడ్ బై చెప్పిన రోజు జగన్ ఇంటి దగ్గర సెల్యూట్ చేసి నమ్మినందుకు నా గొంతు కోశారు అని కామెంట్స్ చేశారాయన. సరిగ్గా అవే ఇప్పుడు పార్టీలోకి తీసుకోవడానికి అడ్డంకిగా మారాయట. జగన్ కూడా రాయబారానికి వచ్చిన స్వామీజీల దగ్గర ఆ విషయాన్నే వత్తి మరీ చెప్పారంట. చూడాలి మరి ఏం జరుగుతుందో