హరీశ్, కేటీఆర్లపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. చెరోదిక్కు దోచుకున్నారని, ఒక్కో వ్యవస్థను చెరబట్టారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిలయింది కాబట్టి.. మళ్లీ మేమే వస్తామని గోతికాడి నక్కల్లాగా ఎదురు చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆమె కీలక విషయాలను వెల్లడించారు. హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
పాల వ్యాపారం చేసి కోట్లు కూడబెట్టుకున్నాడని హరీశ్ను విమర్శించిన కవిత.. కేటీఆర్ రియల్ ఎస్టేట్ రంగాన్ని చెరబట్టాడని, ఆంధ్ర ప్రాంతా నాయకులు, ఆఫీసర్లతో సంబంధాలుండటంతో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. హరీశ్ రావు కు బీజేపీతో సంబంధాలున్నాయని, ఏ సమయంలోనైనా వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరుతారని ఆరోపించారు.
అతనో తిన్నింటి వాసాలు లెక్కబెట్టె వెన్నుపోటు దారుడని, కేసీఆర్కు ఈ ముప్పు పొంచి ఉందన్నారు కవిత. అయినా ఆ పార్టీ ఎటు పోతే నాకేంది..? పది ముక్కలై… వెయ్యి చెక్కలైతే నాకేంటీ..? అని తిట్ల దండకమందుకున్న కవిత.. వ్యవస్థీకృత అవినీతికి పాల్పడిన బీఆరెస్.. మళ్లీ అధికారం కోసం ఎదురు చూస్తున్నదని మండిపడ్డారు.
ఒకరు పాలు అమ్ముకుని కోట్లు గడిస్తే.. ఇంకొకరు రియల్ ఎస్టేట్ రంగాన్ని చెరబట్టారని, మరొకరు ఇసుక సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించిన ఆమె.. వీరికా మరోసారి అధికారం ఇవ్వడం.. అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్షణ సేన నిజాయితీగా ప్రజలకు సేవ చేసేందుకు పుట్టిన పార్టీ అని, కొత్త పార్టీకి ఓసారి జనం అవకాశం ఇచ్చి చూడాలని ఆమె కోరారు.
సీఎం రేవంత్రెడ్డి ఆంధ్ర ప్రాంత ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సోయి లేదన్నారు. ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీఆరెస్.. అధికార పార్టీ రెండూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాయని, అందుకే బారాఖూన్ మాఫీలా కేసులన్నీ పెండింగ్లో పడ్డాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ కు అన్యాయం చేసేలా , ఆంధ్రోళ్లకు వంతపాడేలా సీఎం పాలన ఉందని, దీన్ని వెంటనే మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. హరీశ్పై క్విడ్ ప్రో కో కేసు పెట్టాలని సీఎంను డిమాండ్ చేశారు కవిత.