Achampet Politics: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో కారు పార్టీకి కష్టాలు తప్పడం లేదట…. పది సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా ఏలిన కారు పార్టీకి ప్రస్తుతం నియోజకవర్గం లో సరైన నాయకుడు కరువయ్యాడట. దీంతో పార్టీ శ్రేణులు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారంట. ఎంపీ ఎన్నికల్లో సీటు రాక భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీని విడిచి పక్క పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో తమ కంచుకోట బద్దలవ్వడంతో బీఆర్ఎష్ అధిష్టానానికి భవిష్యత్తు తలనొప్పిగా మారిందట…పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో కంగుతిన్న ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరింత నిరాశకు గురిచేశాయంట. అసలు అచ్చంపేట నియోజకవర్గం కారు పార్టీకి వచ్చిన కష్టాలు ఏంటి?
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదేళ్లపాటు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతం … తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది…అచ్చంపేట నియోజకవర్గంలో కారు పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన గువ్వల బాలరాజు విజయం సాధించి ఆ సెగ్మెంట్లో ప్రాబల్యాన్ని చాటుకున్నారు…అక్కడి రాజకీయంతో పాటు బాలరాజు దూకుడు సైతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి… బాలరాజు వరుసగా రెండుసార్లు గెలవడంతో పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన గులాబీ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేటలో చతికిల పడింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై చిక్కుడు వంశీకృష్ణ విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు…. అక్కడితో బీఆర్ఎస్ గుత్తాధిపత్యానికి అచ్చంపేటలో బ్రేకులు పడ్డాయి.
నల్లమల అటవీ ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం ఎప్పుడు రాష్ట్రంలో సంచలనమే…. పదేళ్లు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాటల తూటాలతో అక్కడ రాజకీయం హాట్హాట్గా నడిచింది…తరువాత జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది…2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో టికెట్ ఆశించి భంగపడ్డాడు… కేసీఆర్ దత్తపుత్రుడునని చెప్పుకునే గువ్వల బాలరాజు.. ఎంపీ దక్కకపోవడంతో పార్టీ తనను వెన్నుపోటు పొడిచిందంటూ కమలం పార్టీలో చేరి కారు పార్టీకి షాక్ ఇచ్చాడు….. దీంతో పార్టీకి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి.
అచ్చంపేట నియోజకవర్గం ఒకప్పుడు గులాబీ పార్టీకి కంచుకోటగా వెలుగొందినా.. ప్రస్తుతం ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతూ, ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు… దీంతో అక్కడి క్యాడర్ నిరాశలోకి వెళ్లిపోయారు …గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో టిఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది …అయితే ఆయన కమలం గూటికి చేరాక ప్రస్తుతం పార్టీ బాధ్యతలు నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అప్పగించారు.. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి సైతం పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో తమకు ఏది కలిసి రావడం లేదంటూ మర్రి జనార్దన్ రెడ్డి కూడా పెద్దగా అచ్చంపేటపై దృష్టి సారించడం లేదట…దాంతో అచ్చంపేట బీఆర్ఎస్లో నడిపించే నాయకుడు లేక పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాయంట.
అచ్చంపేట నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ అడ్డాగా మారిపోయింది. చిక్కుడు వంశీకృష్ణ గెలుపు తర్వాత ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో అభివృద్ధి పనులు చక చాక జరిగిపోతున్నాయట.. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ మరింత బలాన్ని పెంచుకొని వచ్చే ఎన్నికల్లో సైతం ఇక్కడ జెండా పాతడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఎవరు లేకపోయినా అచ్చంపేటలో గులాబీ పార్టీని బలంగా మారుస్తానని చెప్పిన మర్రి సైతం మౌనంగా ఉండడంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందట….
ఒకప్పుడు నల్లమల అంతా మాదే అంటూ ప్రగల్బాల పలికిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం పార్టీని పట్టించుకోకపోవడంపై లోకల్ క్యాడర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కారు పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి…. మరి రాబోయే రోజుల్లో అచ్చంపేటలో పార్టీని భుజాల పైన వేసుకుని నడిపించే నాయకుడు వస్తాడా? లేక తమకెందుకులే అని ఎవరికి వారు కాడె వదిలేస్తారే అన్నది చూడాలి.
Story by: Apparao, Big Tv