అనుకోకుండా జరిగే ఓ చిన్న పొరపాటు మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చేలా చేస్తుంది. అప్పటిదాకా ఎవరూ ఊహించరు. ఏదో అనుకోకుండా, అన్యపదేశంగా జరిగిన ఓ సంఘటన.. ఓ మాట మొత్తం సీన్ రివర్స్ అయ్యేలా చేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రెండు పార్టీల్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
దీని వల్ల ఉన్నపళంగా ఆ రెండు పార్టీల కొంపలేమీ మునగలేదు కానీ, ఇజ్జత్ పోయింది. జనం ముందు నవ్వులపాలయ్యారు. నేటి రాజకీయాలపై ఓ మచ్చలా జనం దీన్ని చూస్తున్నారు. పైగా.. ఈ రెండు పార్టీల నేతలు వీరిని కాపాడుకునే క్రమంలో, తమ రాజకీయాలను సమర్థించుకునే ఎపిసోడ్లో మరింత అభాసుపాలై.. కొత్త రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు.
యథారాజా తథా ప్రజా అంటారు. తమ నేతలు ఎలా ఆలోచిస్తున్నారో.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలో.. వారిని ఖుషీ చేసి పదవులు పొందేందుకు ఎలాంటి యుక్తులు పన్నాలో వారికి అర్థమైపోతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ నేతల నుంచి అలాంటి అలవోక మాటలు నోరుజారి, ఆ నేతల వ్యక్తిత్వాలను, ఆ రాజకీయాలను పాతాళంలోకి పడేయాస్తాయనే సోయి ఉండదు. జనం ఏమనుకుంటారోనని సంస్కారమూ అప్పుడు పనిచేయదు.
ఎవరిది పై చేయిగా నిలిచింది? ఎంత రచ్చ చేశాం..? అనేదే ప్రధాన పాయింట్గా ఇరు పార్టీలు తీసుకోవడమే ఇప్పుడు అసలైన సమస్యగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు .. స్పీకర్ గాడు.. ఎవడాడు లం..కొడుకు మమ్మల్ని ఆపడానికి..? అంటూ బాహాటంగానే అసెంబ్లీ ముందు నడిరోడ్డుపై చిందులేశాడు. దీన్ని కేటీఆర్, కేసీఆర్, హరీశ్.. అంతా సమర్థించుకున్నారు. అలా అనలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. ఒకవేళ.. స్పీకర్ బాధపడి ఉంటే.. చింతిస్తున్నాం.. విచారిస్తున్నాం.. అంటూ లైట్ తీసుకున్నారు.
ఇక ఇదే ఊపులో రేవంత్ మనసు గెలుచుకునేందుకు వేముల వీరేశం.. కేసీఆర్ ఫామ్హౌజ్ వద్ద చావు డప్పు కొడతామని ప్రకటించాడు. అన్నట్టుగానే హంగామా చేశారు కాంగ్రెస్ నేతలు. ఉద్రిక్తతకు దారి తీసేలా చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్నుద్దేశించి అలా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీకి నష్టమే చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎంత చేయాలో అంత చేసింది. అక్కడితే దీనికి ముగింపు పలకకుండా వేముల వీరేశం లాంటి నేతలను రంగంలోకి దింపి రణరంగం చేయడం ద్వారా కాంగ్రెస్ కావాలనే చేసే చీప్ రాజకీయ ఎత్తుగడగా జనం దీన్ని చూశారు.
దీనికి తోడు వీర్ల శంకర్.. మేము కేసీఆర్ చావు కోరుతున్నామని దిగజారి కామెంట్ చేశాడు. దీన్ని కూడా కాంగ్రెస్ సమర్థించుకున్నది. ఏదో బాధలో అని ఉంటాడు.. అని ఏకంగా టీపీసీసీ చీఫే మాట్లాడటం .. ఇలాంటి రాజకీయాలను అగ్రనేతలే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఫామ్హౌజ్ను ముట్టడించాలని పసుపు నీళ్లతో సంప్రోక్షన పేరుతో కొందరు బీఆర్ఎస్ నేతలు అతి చేసి అభాసుపాలయ్యారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్ మెప్పుకోసమేనని వేరే చెప్పక్కర్లేదు. వీటిని ఆదిలోనే కంట్రోల్ చేయకపోతే, పెంచి పోషించినట్టు వ్యవహరిస్తే.. ఇద్దరి కొంపలు ముంచుతాయి. పర్యవసానాలు రెండు పార్టీలు అనుభవించాల్సే ఉంటుంది.