Voter List: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో సర్ తూతూమంత్రంగా నడుస్తుంది. ఓటరు జాబితా ముసాయిదాలో అనమాలిస్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్, రిపీటెడ్ ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్వహిస్తున్న విచారణలు అడ్డగోలుగా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అరవై ఏళ్ల పై బడిన వయోవృద్ధులైన ఓటర్లు, ఇప్పటికే మృతి చెందిన ఓటర్ల కుటుంబ సభ్యులను అనవసరమైన సర్టిఫికెట్లు తీసుకురావాలని కూడా సూచిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12 లక్షల 53 వేల పై చిలుకు ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 7 లక్షల 26 వేల 211 నోటీసులు మాత్రమే జారీ చేసి, దాదాపు 67 వేల 743 విచారణలను పూర్తి చేశారు.
జారీ చేసిన నోటీసుల్లో దాదాపు 3 లక్షల 25 వేల 5 నోటీసులకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేవలం 116 మంది ఓటర్లు మాత్రమే స్పందించగా, వారికి హియరింగ్ తేదీ, సమయాన్ని అధికారులు రీ షెడ్యూల్ చేశారు. ఇంకా 5 లక్షల 27 వేల 665 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అత్యధికంగా హియరింగ్ లను యాకుత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో 11 వేల 46 నిర్వహించారు. అత్యల్పంగా విచారణలను సనత్ నగర్ నియోజకవర్గంలో కేవలం 279 మంది ఓటర్లకు హియరింగ్ లు నిర్వహించారు. చాలా వరకు హియరింగ్ లో చనిపోయిన ఓటర్లకు సంబంధించి పాస్ పోర్టు, బర్త్ సర్టిఫికెట్, లేదా కుల ధృవీకరణ పత్రాలు అడుగుతున్నట్లు తెలిసింది.
నాంపల్లి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్ పరిధిలో చనిపోయిన ఓ ఓటరుకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలను సమర్పించినా, కుల ధృవీకరయణ పత్రం కావల్సిందేనని సూచించగా, సదరు ఓటరు కుటుంబం ఆయన చనిపోయారని చెప్పినా, ఇపుడు దరఖాస్తు చేసుకుని, వచ్చిన తర్వాత సమర్పించాలని సూచిస్తున్నారంటే, ఎలక్షన్ స్టాఫ్ కు హియరింగ్ లు, వాటికి కావల్సిన సర్టిఫికెట్లపై ఏ మాత్రం అవగాహన ఉందో అంచనా వేసుకోవచ్చు. హైదరాబాద్ జిల్లాలోని పుట్టి, ఇక్కడే స్థిరపడి, ఇప్పటి వరకు మూడు, నాలుగు సార్లు ఓట్లు వేసిన ఓటర్లకు సైతం నోటీసులు జారీ కావటంతో ఓటర్లు బెంబేలెత్తిపోతున్నారు. పలు నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా విచారణలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Also read: SIR తర్వాత ఓటర్ లిస్ట్లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఒకటైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కూడా 65 వేల 854 మంది ఓటర్లకు విచారణలను పూర్తి చేశారు. ఈ జిల్లాలో మొత్తం 14 లక్షల 7 వేల 313 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2 లక్షల 52 వేల 846 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇంకా 11 లక్షల 54 వేల 472 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసులు జారీ చేసిన ఓటర్లలో సుమారు 6 లక్షల 56 వేల 774 మంది ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేవలం 5 వేల 439 మంది ఓటర్లకు విచారణ తేదీ, సమయాన్ని రీ షెడ్యూల్ చేశారు. ఈ జిల్లాలో మొత్తం అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, వీటిలో ఉప్పల్ నియోజకవర్గంలో అత్యధికంగా 18 వేల 69 మంది ఓటర్లకు విచారణ పూర్తి చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12 లక్షల 33 వేల 490 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 5 లక్షల 14 వేల 507 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి, 73 వేల 342 మంది ఓటర్లకు విచారణలు పూర్తి చేశారు. ఎనిమిది నియోజకవర్గాల్లో అత్యధికంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 23 వేల 900 విచారణలను పూర్తి చేశారు.
Also read: బిగ్బాస్ ఓటింగ్.. ఎలిమినేషన్ కి దగ్గరగా ఆ ఇద్దరే!