Dharani Portal: ధరణి పోర్టల్ ఓ విప్లవంగా గత ప్రభుత్వం వర్ణించింది. కేవలం వేలు ముద్ర వేస్తే చాలు.. యజమాని భూమి పట్టా చేతిలో ఉంటుందని.. రెవెన్యూ అధికారుల లంచాలకు చెక్ పెట్టిందని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అయితే.. మేడిపండులా పైకి ఎంతో గొప్ప సంస్కరణలా కనిపించిన ధరణి.. పొట్టవిప్పి చూస్తే అన్నీ అక్రమాలే కనిపిస్తున్నాయి. ఘోస్ట్ ఐడీలతో లక్షల ఎకరాల భూరికార్డులు చేతులు మారినట్టు గుర్తించారు అధికారులు.
కేరళ సంస్థకు బాధ్యతలు అప్పగింత
ధరణి అక్రమాల బాగోతాన్ని బయటకు తీయాలని కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ సెంటర్ అనే ఆడిట్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్. ఆ సంస్థ తాజాగా ఇచ్చిన రిపోర్టులో అక్రమాల పుట్టను బయట పెట్టింది. అందులో 8 లక్షల లావాదేవీల్లో 22 వేలు అనుమానాస్పదంగా ఉన్నాయని తేల్చింది. దాదాపు 10 వేల ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేసినట్టు గుర్తించారు అధికారులు.
Also Read: ఫ్రూట్స్, ఫిష్ కోడ్లతో డ్రగ్స్ దందా.. హైదరాబాద్లో నయా ట్రెండ్!
ఓటీపీతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు
భూయజమాని ఆధార్, వేలిముద్ర, ఓటీపీతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించారు. అంటే, ఎక్కడో అమెరికాలో, వేరే రాష్ట్రంలో ఉన్న భూయజమానికి తెలియకుండానే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసేశారన్నమాట. ఇందుకోసం ధరణిలో పనిచేసి మానేసిన టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఐడీ పాస్వర్డ్లను యాక్టివ్గా ఉంచుతూ పని కానిచ్చేశారని సమాచారం. ఘోస్ట్ ఐడీల ద్వారా అర్ధరాత్రుల్లో డేటాను ట్యాంపర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఇంటర్ఫేస్ కోడింగ్లో లోపాలు
జనగామ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలో జరిగిన చలానా మోసాలను కనిపెట్టారు. ధరణి పోర్టల్కు, ట్రెజరీకి, బ్యాకింగ్ పేమెంట్ గేట్వేలకు అనుసంధానంగా ఉండే అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ కోడింగ్లో లోపాలను గుర్తించారు. ముఖ్యంగా NRI భూముల, ఎవరూ పట్టించుకోని వృద్ధుల భూములను టార్గెట్ చేయడానికి ఈ టెక్నిక్ వాడినట్లు గుర్తించారు.
Also Read: మెట్రో ప్రయాణికులకు తిప్పలు: డిజిటల్ జోరు.. సామాన్యుడికి బేజారు!
బాధితులకు న్యాయం జరుగుతుందా..?
ధరణిలో సాంకేతిక లోపాలు బయట పడటంతో ప్రభుత్వం హై లెవల్ కమిటీ ద్వారా ఒరిజినల్ సాప్ట్వేర్ ఆర్కిటెక్ట్, కన్సల్టెంట్లపై క్రిమినల్ ఇన్విస్టిగేషన్కు సిఫార్సు చేసింది. మరి వేల ఎకరాలను అప్పనంగా కొట్టేసిన కేటుగాళ్లు ఇంకెందరు ఉన్నారు? వాళ్లందరినీ గుర్తించడం సులువైన పనేనా? ఎప్పటి వరకు వారిని గుర్తిస్తారు? బాధితులకు న్యాయం జరుగుతుందా? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.