Hyderabad Drug: నగరంలో డ్రగ్స్ కలకలం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఒకప్పుడు ముంబై, గోవా వంటి ప్రాంతాల నుంచే డ్రగ్స్ సరఫరా అయ్యేవి. కానీ, ఇప్పుడు భాగ్యనగరం డ్రగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. పోలీసుల కళ్లు గప్పేందుకు పెడ్లర్లు వేస్తున్న ఎత్తుగడలు, వాడుతున్న టెక్నాలజీ చూస్తుంటే విస్తుపోవాల్సి వస్తోంది.
ఫ్రూట్స్, ఫిష్ పేర్లతో సీక్రెట్ కోడ్లు
నిఘా వర్గాలకు అస్సలు అనుమానం రాకుండా ఉండేందుకు పెడ్లర్లు సరికొత్త కోడ్ లాంగ్వేజ్ను వాడుతున్నారు. పండ్లు, చేపల పేర్లతో వ్యాపారం కానిచ్చేస్తున్నారు. మ్యాంగో 5 అంటే 250 గ్రాముల గంజాయి. గువా 2 అంటే 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA). 5 సీ ఫిష్ అంటే ఎల్ఎస్డీ (LSD) బ్లాట్స్ అని అనేక రకాల కోడ్లతో చాటింగ్లు చేస్తూ యథేచ్ఛగా ఆర్డర్లు తీసుకుంటున్నారు.
రాష్ట్రాల నంబర్ ప్లేట్లు.. రవాణాకు అన్ని మార్గాలు
ఏ రాష్ట్రం నుండి గంజాయి లేదా డ్రగ్స్ తీసుకొస్తున్నారో, సరిగ్గా అదే రాష్ట్రానికి చెందిన నంబర్ ప్లేట్లను వాహనాలకు తగిలించి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒక మార్గాన్ని పోలీసులు క్లోజ్ చేస్తే, మరో రూట్ను వెతుక్కుంటున్నారు. ట్రైన్లు, బస్సులు, కార్లే కాకుండా చివరకు కొరియర్, పోస్టల్ సర్వీసులను కూడా వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్కు చెందిన ఓ పెడ్లర్ అయితే దొరికిన ప్రతి ప్లాట్ఫామ్ను వాడుకుంటూ సరఫరా నెట్వర్క్ను నడుపుతున్నాడు.
గుట్టు చప్పుడు కాకుండా ‘డెడ్ డ్రాప్’ పద్ధతి
ట్విస్ట్ ఏంటంటే.. అమ్మేవాడు ఎవరో, కొనేవాడు ఎవరో ఒకరికొకరు తెలియదు. అంతా సోషల్ మీడియాలోనే ఆర్డర్లు, ‘డెడ్ డ్రాప్’ పద్ధతిలోనే డెలివరీలు జరుగుతాయి. డ్రగ్స్ను ఒక రహస్య ప్రదేశంలో దాచి, ఆ లొకేషన్ను కస్టమర్కు పంపుతారు. ఇక డబ్బుల లావాదేవీల కోసం చిన్న వ్యాపారులు, పాన్ షాప్ యజమానులు, తోపుడుబండ్ల వారి బ్యాంక్ ఖాతాలను వాడుకుంటున్నారు. వారికి 10 నుండి 20 శాతం కమీషన్ ఆశ చూపి ఈ ఊబిలోకి లాగుతున్నారు.
గడిచిన ఆరు నెలల్లోనే డ్రగ్స్కు బానిసైన దాదాపు 200 మందిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, తాము ఎవరి దగ్గర కొన్నామో కూడా బాధితులు చెప్పలేకపోతుండడం ఈ గ్యాంగ్ల నెట్వర్క్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేస్తోంది.