Hate Speech: ఎన్నో విమర్శలు.. మరెన్నో అభ్యంతరాలు.. అయినా అడుగు ముందుకే వేసింది రేవంత్ సర్కార్. విద్వేష ప్రసంగాల నియంత్రణ బిల్లును పకడ్బందీగా మార్చేందుకు అసెంబ్లీ, మండలి వేదికగా సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఛైర్మన్గా మంత్రి పొన్నంను నియమించింది. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని గతంలో అన్ని పార్టీల నేతలు సూచించిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తప్పుడు పోస్టులకు చెక్
ఒక వ్యక్తి, ప్రభుత్వం లేదా వ్యవస్థ చేస్తున్న తప్పులను, లోపాలను ఎత్తిచూపడం, ప్రశ్నించడం.. అనేది విమర్శ. ఒక గ్రూపు, మతం, కులం లేదా ప్రాంత ప్రజలను కించపరచడం, మనోభావాలను దెబ్బతీయడం అనేది విద్వేషం. ప్రస్తుత సమాజంలో ఈ రెండింటికీ తేడా లేకుండా పోయింది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తులు, ప్రభుత్వం ఇలా ఎవరిపైనైనా కొందరు తప్పుడు పోస్టులు పెడుతున్నారు. దానిపై ప్రశ్నిస్తే రాజ్యాంగంలోని హక్కులను చూపుతూ.. ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తోందని సమాచారం.
విపక్షాల ప్రశ్నల వర్షం
అయితే, విద్వేషం విషయంలో ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దానికి పరిధులు ఏంటి? విద్వేషానికి నిర్వచనం ఏంటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా వాడుకునే అవకాశాలు లేవా? ప్రభుత్వ విధానాలపై గళమెత్తే విపక్షాలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించరని గ్యారెంటీ ఏంటి? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ బిల్లు కక్ష సాధింపుకు కాదని ప్రభుత్వం చెబుతోంది. అసలు విద్వేషానికి చట్టంలో స్పష్టమైన, ఖచ్చితమైన నిర్వచనం ఉండదు.
Also Read: వయనాడ్లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!
ఈ అస్పష్టత వల్ల పోలీసులు తమకు నచ్చినట్లుగా చట్టాన్ని వాడుకొని, ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం లభిస్తుంది. ఇది పోలీస్ రాజ్కు దారితీస్తుందని విపక్షాలు అంటున్నాయి. మరి ఇలాంటి అభ్యంతరాలకు, విమర్శలకు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుంది? చట్టానికి పరిధులను ఎలా నిర్ణయిస్తుంది? ఈ బిల్లు చట్టరూపం దాల్చడం అంత ఈజీనా? ఇలాంటి ప్రశ్నలకు బిల్లు ద్వారా అతి త్వరలోనే క్లారిటీ రానుంది.