Hyderabad Metro: సాంకేతికత పెరగడం, డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయడం మంచి పరిణామమే. కానీ, అది అందరికీ సౌకర్యవంతంగా ఉన్నప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో జరుగుతున్న పరిణామాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. టెక్నాలజీ అప్గ్రేడ్ పేరుతో స్టేషన్లలోని టికెట్ కౌంటర్లను ఒక్కొక్కటిగా మూసేస్తుండటంతో సామాన్య ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
కౌంటర్లు బంద్.. మెషీన్లే దిక్కు!
‘ఇకపై క్యాష్ వద్దు.. డిజిటల్ టికెట్లే ముద్దు’ అన్నట్టుగా అధికారులు టికెట్ కౌంటర్లకు తాళాలు వేస్తున్నారు. ప్రయాణికులను కేవలం ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల (ATVM) వైపే మళ్లిస్తున్నారు. నగరం మొత్తంలోనే అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట వంటి కీలకమైన జంక్షన్ స్టేషన్లలో కూడా టికెట్ కౌంటర్లు మూసేయడంతో ప్రయాణికుల్లో అసహనం నరాలెత్తుతోంది. మెషీన్ల ముందు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని జనం మండిపడుతున్నారు.
Also Read: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ఉక్కుపాదం.. తెలంగాణ కొత్త బిల్లు ప్రత్యేకతలు!
ఆ వర్గాల పరిస్థితి ఏంటి?
టెక్నాలజీ అనేది అందరికీ ఒకేలా అందుబాటులో ఉండదు. ముఖ్యంగా వృద్ధులు, గ్రామాల నుంచి కొత్తగా నగరానికి వచ్చి మెట్రో ఎక్కేవారు, స్మార్ట్ఫోన్లు లేదా డిజిటల్ పేమెంట్లు వాడటం తెలియని వారు ఈ విధానంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మెషీన్ల దగ్గర యూపీఐ స్కాన్ కాకపోవడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ప్రయాణికులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
కావాలి ‘హైబ్రీడ్ విధానం’
పూర్తిగా డిజిటల్ వైపు వెళ్లడం కంటే.. కొంతకాలం పాటు ‘హైబ్రీడ్ విధానాన్ని’ అమలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. టెక్నాలజీ వాడటం తెలిసిన వారి కోసం డిజిటల్ మెషీన్లు, ఆన్లైన్ యాప్స్ ఉంచుతూనే.. సామాన్యులు, నగదు చెల్లించే వారి కోసం కనీసం ఒకటి లేదా రెండు మాన్యువల్ కౌంటర్లను రన్ చేయాలని కోరుతున్నారు. అందరికీ టెక్నాలజీపై అవగాహన ఉండదనే కనీస కోణంలో అధికారులు ఆలోచించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ప్రజా సమస్యపై మెట్రో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.