Dharman Rao: వైసీపీ అధ్యక్షుడు జగన్ గత ఎన్నికల ముందు తనదైన సర్వే నివేదికలంటూ ఆయా సెగ్మెంట్లలో అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేసి బొక్కబోర్లా పడ్డారు. సీనియర్లు, జూనియర్లు అని లేకుండా కొందరిని పక్కన పెట్టేస్తే.. మరి కొందరు సెగ్మెంట్లు చివరి నిముషంలో మార్చేశారు. ఆ ప్రయోగాలేవీ ఫలించకపోవడంతో జగన్ తన ఆలోచన మార్చుకుంటున్నారు? ఒకప్పుడు పక్కన పెట్టిన నేతలను ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారా? పార్టీలో శ్రీకాకుళం సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి కీలక పదవి అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ధర్మానకు నిజంగా ప్రాధాన్యత దక్కితే పార్టీకి కలిగే ప్రయోజనం ఏంటి?
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాంగ్రెస్ హయంలో రాష్ట్రస్థాయిలో ఆయన చక్రం తిప్పారు. అయితే వైసీపీలో చేరాక మాత్రం ఆయన ప్రాభవం ఒకింత తగ్గిపోయిందనే చెప్పాలి. కారణాలు ఏమైనాప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్నాళ్లు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ధర్మాన మిగిలిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాల్లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు పేర్లు సీఎం రేసులో కూడా వినిపించాయి. అలాంటి ధర్మానకు వైసిపి హయాంలో అనుకున్న ఆదరణ లభించలేదనేది వాస్తవం. దీంతో ఆయన కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతూ మౌనం వహించారు. చివరి రెండేళ్లు జగన్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టినప్పటికీ.. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత చాలా సైలెంట్ అయ్యారు. అసలు ఆయన వైసీపీలో ఉన్నారా? మరో పార్టీలో చేరుతారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ ధర్మానకు ఇప్పుడు టైం వచ్చిందని ఆయన వర్గం చెబుతోంది.
ధర్మాన ప్రసాదరావు సేవలను వినియోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. టిడిపి, జనసేన, బిజెపి కలయికతో కూటమి చాలా బలంగా ఉంది. ఈ కూటమి ఢీ కొట్టాలంటే ఆవేశంతో మాట్లాడే వారి కంటే వ్యూహాత్మకంగా అడుగులు వేసే ధర్మాన లాంటి వారు కావాలి అని జగన్ గుర్తించినట్టు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత గత రెండేళ్లగా ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు, ఆ పార్టీ నేతల నోటి దురుసు కారణంగానే చాలా ఇబ్బందులు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తొలగాలి అంటే విషయంపైన స్పష్టమైన అవగాహన, అనుభవం ఉన్న నాయకుడు అవసరం. అలాంటి లక్షణాలున్న ధర్మానకు ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి లేదా రాష్ట్రస్థాయి పదవి కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నట్టు ఆ పార్టీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.
ధర్మాన ప్రసాదరావుకి ఉన్న పరిచయాలు, ఆయన రాజకీయ అనుభవం కూడా వైసిపికి చాలావరకు కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. అప్పటి కాంగ్రెస్లో, ఇప్పటి వైసీపీలో చాలామంది ధర్మాన ప్రసాదరావు అనుచరులు సహచరులు ఉన్నారు. వీళ్ళందర్నీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన వ్యూహాలు పనికొస్తాయని జగన్ భావిస్తున్నారంట
అయితే జగన్ గురించి ముందు నుంచి ఓ నెగిటివ్ అభిప్రాయం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుభవజ్ఞుల వ్యూహాలను వాడుకొని, అధికారంలోకి వచ్చాక తన సామాజిక వర్గానికి కీలక పదవులను కట్టబెట్టారని వైసీపీ అధ్యక్షుడిపై ఉన్న ఆరోపణ. అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా బొత్స సత్యనారాయణచ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళకి పేరుకి పదవులు ఉన్నాచ పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదని వారి అనుచరులు ఆవేదన వ్యక్తం చేసేవారు. బొత్స సంగతి అటు ఉంచితే ధర్మాన పరిస్థితి గత ఐదేళ్లు మరింత దారుణంగా ఉండేది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ కి వాస్తవం బోధపడిందని అంటున్నారు.
అందుకే బొత్స సత్యనారాయణకి శాసనమండలి ప్రతిపక్ష నేతగా కీలకమైన బాధ్యతలు అప్పగించారని టాక్. అయితే మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న బొత్స ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అందుకే మరో బలమైన నేతను అన్వేషించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదను ఎన్నుకున్నారని చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇస్తున్న ప్రయారిటీ రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉంచుతారా? లేకపోతే గతంలోలా.. సొంత సామాజిక వర్గానికి కీలక పదవులు కట్టబెడతారా అనేది మాత్రం సమాధానం లేని ప్రశ్నే అంటున్నారు.
Also Read:836 దీవుల అద్భుత ప్రపంచం.. అండమాన్ నికోబార్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు
Story by: Apparao, Big Tv